డిఈవో భర్త వికృతం: చిన్నారులపై లైంగిక వేధింపులు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నగరంలో గల ఓ అపార్ట్మెంట్లో కొన్ని రోజులుగా జరుగుతున్న ఓ అధికార భర్త వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళా డిప్యూటీ డీఈవో భర్తే చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసుల దృష్టికి వచ్చింది. ఫిర్యాదులు అందుకున్న వెంటనే నిందితుడిని అరెస్టు చేశారు.
కర్నూలు సప్తగిరి నగర్లో చంద్ర అపార్ట్మెంట్ ప్లాట్ నెంబరు 104లో కర్నూలు డిప్యూటీ డీఈవో శైలజ, భర్త రవీంద్ర, కూతురు తేజస్వినితో ఉంటున్నారు. శైలజ డ్యూటీపై బయటకు వెళ్లి సాయంత్రం వస్తుంటారు. భర్త రవీంద్ర మాత్రం ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాడు. కూతురు తేజస్విని 7వ తరగతి చదువుతోంది. తేజస్విని కోసం అపార్ట్మెంట్లోని ఇతర ప్లాట్లకు చెందిన తోటి స్నేహితులు వస్తుంటారు. వారంతా ఏడో తరగితే చదువుతున్నారు.
ఈ చిన్నారులపైనే రవీంద్ర కన్నేశాడు. తేజస్వినిని ఏదో ఒక సాకుతో బయటకు పంపి మిగతా బాలికలను మభ్యపెట్టి చెప్పి తన ఒళ్లో కూర్చోబెట్టుకుంటాడు. కంప్యూటర్ గేమ్స్ ఉన్నాయని చెప్పి అశ్లీల చిత్రాలు చూపిస్తుండేవాడు. వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. గత కొన్ని నెలలుగా ఇదే తంతు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇదే అపార్ట్మెంట్కు చెందిన ఓ చిన్నారి తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. మరికొంతమంది చిన్నారులను విచారించడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని పిల్లలు రవీంద్ర భార్య శైలజ దృష్టికి కూడా తీసుకెళ్లినా ఆమె పట్టించుకోనట్లు తేలింది.
బాధితులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం ఎస్పీ రవికృష్ణ దృష్టికి వెళ్లడంతో నిందితున్ని అరెస్టు చేయాలని త్రీటౌన్ పోలీసులను ఆదేశించారు. సీఐ ప్రవీణ్కుమార్ నిందితునిపై 354/ఏ, ఐపీసీ సెక్షన్ 7, 8 పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి కింద అరెస్టు చేసి రిమాండ్కు పంపారు.