జేసీ పారిస్ వెళ్లిపోయారా?: సెక్యూరిటీ మరోలా!.. అశోక గజపతిరాజు అలా ఎందుకు చేశారు?
జేసీ వ్యవహారంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు వ్యవహరించిన తీరుపై కూడా విమర్శలున్నాయి. బోర్డింగ్ ముగిసిన తర్వాత.. జేసీకి బోర్డింగ్ పాస్ ఎలా ఇప్పిస్తారంటూ ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: ఎయిర్ పోర్టు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించి లేని వివాదాన్ని కొని తెచ్చుకున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. మీడియా ముందు వివరణలు ఇచ్చుకోలేక సతమవుతున్నారు. సూటిగా సమాధానం చెప్పలేక.. దాటవేత ధోరణిని అవలంభిస్తూ వస్తున్నారు. మరోవైపు ఆయన చేత క్షమాపణలు చెప్పించాలని టీడీపీ భావిస్తుండటం కూడా ఆయనకు మింగుడుపడటం లేదని తెలుస్తోంది.
స్నేహంతో అధికారిని తోసేశా: ఎయిర్ పోర్ట్లో రచ్చపై జేసీ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలోనే ఆయన పారిస్ చెక్కేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏడు విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించినా.. ఎమిరేట్స్ విమానంలో ఆయన పారిస్ వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ గొడవంతా సద్దుమణిగేవరకు.. దాదాపు 10రోజులు ఆయన అక్కడే గడపనున్నట్లు తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డిపై స్వదేశీ ప్రయాణాల విషయంలో నిషేధం ఉన్న సంగతి ఇంకా ఎమిరేట్స్ దృష్టికి వెళ్లనట్లుగా తెలుస్తోంది.
రెచ్చిపోయిన జేసీ: విశాఖ ఎయిర్ పోర్టులో రచ్చ.. ప్రింటర్ విసిరేసి!..
జేసీ ఇంట్లోనే ఉన్నారా?
జేసీ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. జేసీ గురించి ఎవరు ఆరా తీసినా.. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఎవరైనా కలవడానికి వెళ్తే.. తలనొప్పితో పడుకున్నారని, తర్వాత రావాలని చెబుతున్నారు. దీంతో విదేశాలకు ఏమైనా వెళ్లారా? అని కొంతమంది ప్రశ్నిస్తుండగా.. తెలియదనే చెబుతున్నారు జేసీ సెక్యూరిటీ. ఆయనేం చెప్పమంటే.. అది చెప్పడమే తమ పని అని గుర్తు చేస్తున్నారు.
జేసీపై ఏడు విమానయాన సంస్థల నిషేధం!
విశాఖ ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది పట్ల జేసీ వ్యవహరించిన తీరుకు ఇండిగో, ఎయిరిండియా, జెట్ ఎయిర్వేస్, స్పైస్జెట్ సంస్థలు గురువారం రాత్రి నిషేధం విధించగా.. శుక్రవారం ఉదయం విస్తారా, గో ఎయిర్, ఎయిర్ ఆసియా ఇండియా సంస్థలు కూడా ఆయనపై నిషేధం విధించాయి.
విశాఖపట్నం విమానాశ్రయంలో జేసీ వ్యవహరించిన తీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆయనపై నిషేధం విధించామని, ఆయన ప్రయాణానికి సంబంధించిన ఎలాంటి బుకింగ్స్ను అనుమతించరాదని ఆదేశాలిచ్చామని గో ఎయిర్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
సిబ్బంది మాట లెక్క చేయలేదు:
కేవలం 20నిమిషాల ముందు విమానశ్రయానికి చేరుకుని బోర్డింగ్ పాసు ఇవ్వాలంటూ జేసీ ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో గొడవకు దిగారు. నిబంధనలకు విరుద్దమంటూ సిబ్బంది మాట్లాడటంతో.. కోపంతో ప్రింటర్ ను లాగేందుకు యత్నించి.. సిబ్బందిలో ఒకరి మెడ పట్టుకు తోశారు. ఇదంతా సీసీటి ఫుటేజీలో స్పష్టంగా రికార్డయింది. జేసీ మాత్రం తానేదో స్నేహపూర్వకంగా సిబ్బందిపై చేయి వేశానని చెబుతున్నారు.
ఇండిగో ఫ్లైట్ 6ఈ-608కు సంబంధించిన బోర్డింగ్ పూర్తయిపోయిందని, మరో విమానంలో పంపిస్తామని సిబ్బంది జేసీకి ఎంత నచ్చజెప్పినా.. ఆయన మాత్రం వారి మాట లెక్క చేయలేదని ఇండిగో సంస్థ ప్రతినిధి చెబుతున్నారు. ప్రయాణికులు, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించేవారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని వెల్లడించారు.
అశోక గజపతి రాజుపై విమర్శలు:
జేసీ వ్యవహారంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు వ్యవహరించిన తీరుపై కూడా విమర్శలున్నాయి. బోర్డింగ్ ముగిసిన తర్వాత.. జేసీకి బోర్డింగ్ పాస్ ఎలా ఇప్పిస్తారంటూ ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది ఎంతకీ పాస్ ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో.. అదే ఎయిర్ పోర్టులో ఉన్న అశోక గజపతి రాజు వద్దకు వెళ్లి.. ఆయన రికమండేషన్ తో పాస్ ఇప్పించుకున్నారు జేసీ.
కాగా, విమానం బయలుదేరడానికి గంట ముందు బోర్డింగ్ పూర్తి చేయాల్సిందిగా అశోక గజపతి రాజే కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ మేరకు ఢిల్లీలో కొన్ని బుక్ లెట్స్ సైతం విమాన ప్రయాణికులకు పంపిణీ చేశారు. నిబంధనలు రూపొందించిన వ్యక్తులే.. ఇలా ప్రజాప్రతినిధుల విషయంలో మాత్రం వాటిని సడలించడం విమర్శలకు తావిస్తోంది.