జగన్కు పిచ్చి ముదిరింది, నిద్రపట్టట్లేదు: దేవినేని, కాల్వ ఆగ్రహం
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి పిచ్చి పట్టుకుందని, ఆ పిచ్చి ఇంకా ముదురుతోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం నాడు మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై జగన్కు ఏమాత్రం అవగాహన లేదన్నారు. తాము చేసిన అభివృద్ధిని అభినందించలేకపోతున్నారని విమర్శించారు.
చంద్రబాబు, నారాయణలపై జేసీ సంచలనం: దొంగల్లా అమ్ముకుంటారని..
అలాగే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావుకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.
పోలవరంపై కేంద్రానికి లేఖలు రాసే అర్హత కేవీపీకి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలని రూ.కోట్లు ఖర్చు పెట్టి వైసిపి నేతలు కేసులు వేస్తున్నారని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టుపై జగన్, కేవీపీ సహా కొందరు నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పనులు వీరిద్దరు కుట్ర చేస్తూ, అందులో భాగంగా గ్రీన్ ట్రైబ్యునల్, సుప్రీం కోర్టులో కేసులు వేయిస్తున్నారన్నారు. ప్రజల మద్దతుతో విపక్షాల కుట్రలను తిప్పికొడతామన్నారు.
జగన్ విఫలం: కాల్వ
వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో పది లక్షల గృహ నిర్మాణాలను చేపడతామని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వైసిపి లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధి ఆగదన్నారు.