అవినీతి సాక్షి: జగన్పై దేవినేని ఆగ్రహం, జగన్కు సుజయ షాకిచ్చేనా?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన మీడియా సాక్షి పైన ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులు, నదీజలాల పైన జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి ఛానల్, పత్రికలో ప్రభుత్వం విష ప్రచారం చేస్తోందన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి కృష్ణా జిల్లా నుంచి 1200 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 600 ఎకరాల భూములను రైతులు స్వచ్చంధంగా ఇచ్చారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి సీమకు నీటి కష్టాలు తొలగిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రా, రాయలసీమలకు 511 టీఎంసీలు కేటాయించారని దేవినేని అన్నారు. తెరాసతో కుమ్మక్కై జగన్ తమను విమర్శించవద్దన్నారు. జగన్, రఘువీరా, రామచంద్రయ్య రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్నారు. తెరాస కుట్రలు వాళ్లకు కనిపించడం లేదన్నారు.
పార్టీ వీడే యోచనలో సుజయ
బొత్స సత్యనారాయణ చేరికతో విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి ఛాన్స్ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న విజయ సాయి రెడ్డి ఆయనతో మాట్లాడారని తెలుస్తోంది. జగన్ వచ్చే వరకు పార్టీ వీడే యోచనను వాయిదా వేసుకోవాలని సూచించారని సమాచారం. బొత్స చేరిక పైన సుజయ కృష్ణ రంగారావు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.