'కేంద్రం కాళ్ల వద్ద కూర్చుంటే ఏపీ సమస్యలు తీరవు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ ఆరోపించారు.
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించలేదని ఏపీసీసీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం విజయవాడలో నిరసన ప్రదర్శనలు జరిపారు. ఈ ఆందోళనకు నేతృత్వం వహించిన దేవినేని నెహ్రూ మట్లాడుతూ చంద్రబాబు, వెంకయ్యలు కలిసి ఏపీని నాశనం చేశారని మండిపడ్డారు.
ఇప్పటికే పదిసార్లు ఢిల్లీకి తిరిగానని చెప్పిన సీఎం చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కాళ్ల వద్ద కూర్చుంటే ఏపీ సమస్యలు పరిష్కారం కావని చంద్రబాబుకు సూచించారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లు సాధించుకోవాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.