బాబు గ్రీన్ సిగ్నల్, టిడిపిలోకి దేవినేని నెహ్రూ?: వల్లభనేనితో ఎలా?
విజయవాడ: ఇప్పటికే ఏపీలో ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు లేని కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఝలక్ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో టిడిపిలోకి ఆయన రాక లాంఛనమే అంటున్నారు. దేవినేని నెహ్రూ తన నివాసంలో అనుచరులు, అభిమానులతో భేటీ అయి వారిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు ఇప్పటికే నెహ్రూ ఓ నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు.
1995లో దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీని వీడారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. సమాచారం మేరకు నెహ్రూ.. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడి విషయం చెప్పారని అంటున్నారు.
వల్లభనేనితో కలిసేనా?
దేవినేని కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరితే.. తెలుగుదేశం పార్టీలో ఉన్న వల్లభనేని వంశీతో కలిసేనే అనే చర్చ సాగుతోంది. ఓ సమయంలో దేవినేని నెహ్రూతో వివాదం అంశంపై.. వల్లభనేని మంత్రి దేవినేని ఉమను కూడా టార్గెట్ చేశారు. ఇప్పటికే వైసిపి నుంచి వచ్చిన నేతలతో పాత నేతలకు పొసగడం లేదు. ఇప్పుడు నెహ్రూ వస్తే ఎలా ఉంటుందో ముందు ముందు తెలియనుంది.