అవినాశ్ను ఎమ్మెల్యేగా చూడాలనుకున్న నెహ్రూ: బోరుమన్న లక్ష్మీప్రసన్న
దేవినేని నెహ్రూ తన తనయుడు అవినాష్ రాజకీయ భవిష్యత్తు కోసం గత రెండేళ్లుగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
విజయవాడ: దేవినేని నెహ్రూ తన తనయుడు అవినాష్ రాజకీయ భవిష్యత్తు కోసం గత రెండేళ్లుగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అవినాష్ భవిష్యత్తును తాను చూసుకుంటానంటూ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఆయన టిడిపిలో చేరిన సమయంలో ప్రకటించారు.
దేవినేని మృతి: ఏడ్చిన హరికృష్ణ, హైదరాబాద్ రావొద్దని అవినాష్
అవినాష్కు నెహ్రూ రాజకీయ పాఠాలను సైతం దగ్గరుండి నేర్పించారు. తాను ఎక్కడికి వెళ్లినా, కుమారుడిని వెంట తీసుకెళ్లేవారు. కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాలని ఆశపడ్డారని మంత్రి ఉమామహేశ్వర రావు తెలిపారు. ఎక్కువగా తన కుమారుడి భవిష్యత్తుకు సంబంధించే ఆలోచించేవారన్నారు.
ఇదిలా ఉండగా, దేవినేని నెహ్రూ అంత్యక్రియలు మంగళవారం జరుగుతున్నాయి. గుణదలలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తారు. సోమవారం ఉదయం నెహ్రూ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.
కిడ్నీ ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్త
సోమవారం మృతి చెందిన దేవినేని నెహ్రూకు పదిహేడేళ్ల క్రితమే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి ఆరోగ్యం విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. బయటి ఆహారాలు తినరు. మంచినీళ్లు కూడా ముట్టరు. అయినా కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మార్చి 29న విజయవాడలో టిడిపి ఆవిర్భావ దినోత్సవ ర్యాలీని భారీగా నిర్వహించారు.
ఇంటికెళ్లే నెహ్రూ.. ఆ రోజు మాత్రం..
అనంతరం లారీ ఓనర్స్ అసోసియేషన హాల్లో వేలాది కార్యకర్తలతో జరిగిన సభలో నెహ్రూ హుషారుగా పాల్గొన్నారు. సాధారణంగా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా సరే ఆయన మధ్యాహ్నం 12 గంటలకల్లా ఇంటికి భోజనానికి వెళ్లి వస్తారు. అలాంటిది ఆ రోజు మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశంలోనే ఉన్నారు. అదే రోజు రాత్రి ఆయనకు జ్వరం వచ్చింది. మూడు రోజుల పాటు వరుసగా మందులు వాడినా తగ్గకపోవడంతో వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి వెళ్లారు.
వస్తానని చెప్పి వెళ్లిన అవినాశ్
ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు కేర్ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. 14వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది రోజులు హైదరాబాద్లోనే ఉండాలని వైద్యులు సూచించడంతో బంజారాహిల్స్లోని తన ఫ్లాట్లో ఉంటున్నారు. ఆదివారం వరకు తండ్రితో ఉన్న ఆయన తనయుడు అవినాశ్ సోమవారం మళ్లీ వస్తానని చెప్పి విజయవాడ వచ్చారు. ఈ లోపే ఎవరూ ఊహించని విధంగా నెహ్రూ ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యారు.
సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నీరసంగా నిద్ర లేచిన నెహ్రూ బాత్రూమ్కు వెళ్లి రాగానే ఇంట్లోనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన భార్య లక్ష్మి కారు డ్రైవర్ను పిలిచి కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, ఆయనిక లేరన్న విషాద వార్తను ప్రకటించారు. విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కేర్ ఆసుపత్రికి వచ్చి నెహ్రూ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
బెజవాడకు ర్యాలీ
హైదరాబాద్ నుంచి నెహ్రూ భౌతిక కాయాన్ని ర్యాలీగా విజయవాడకు తీసుకొచ్చారు. నెహ్రూ సోదరుడు, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు హైదరాబాద్ నుంచి భౌతికకాయం వెంట వచ్చారు. వేల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు కృష్ణా జిల్లా నలుమూలల నుంచి వచ్చారు. మృతదేహాన్ని ఆయన ఇంట్లో ఉంచారు. సాయంత్రం నాలుగు గంటలకు సీఎం చంద్రబాబు నెహ్రూ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
బోరుమన్న మోహన్ బాబు, లక్ష్మీప్రసన్న
ఆయన మృతదేహాన్ని చూసి సినీ నటుడు మోహనబాబు, ఆయన కుమార్తె లక్ష్మీప్రసన్న భోరున విలపించారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర మంత్రులు, నేతలు నివాళులు అర్పించారు. నెహ్రూ భౌతిక కాయానికి మంగళవారం మధ్యాహ్నం గుణదలలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఉద్వేగంగా..
టీడీపీలో పునఃప్రవేశం చేసిన నెహ్రూ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... తాను టిడిపిలోనే రాజకీయంగా పుట్టానని, ఆ పార్టీ జెండా కప్పుకునే చనిపోతానని ఉద్వేగంగా మాట్లాడారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినపుడు ఆయన ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి 1996 వరకు టీడీపీలో కొనసాగారు. 1995లో జరిగిన పరిణామాలలో ఎన్టీఆర్ వైపు నిలిచి, ఆయన మరణానంతరం కాంగ్రె్సలో చేరారు. ఆరునెలల క్రితమే తిరిగి టీడీపీలో చేరారు.