వారిని డమ్మీలు చేశారు: దేవినేని ఉమపై రఘువీరా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలో మంత్రి ఉమా మిగిలిన మంత్రులను డమ్మీలను చేయడ వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందనిరఘువీరా ఆరోపించారు. విజయవాడలో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
విజయవాడ లాంటి అధ్యాన్న ఆసుపత్రిని నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా చూడలేదని, పీహెచ్సీ కంటే దారుణంగా ఉందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి, వైద్యమంత్రి ఆస్పత్రులు, కాల్వగట్ల మీద నిద్రపోవడం కాదు, వ్యవస్థలు నిద్రపోకుండా చూడాలని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉండాగా ప్రభుత్వాసుపత్రిపై విమర్శలు చేసిన ఉమా ఇప్పుడు వాటివైపు కన్నెత్తి చూడటం లేదని ఆయన అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలనలో ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన ఏపీ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ మ్యానిఫెస్టో పత్రాలను దహనం చేస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేస్తామన్న బీజేపీ వాటిని రెట్టింపు చేసిందన్నారు.
క్లీన్ టీం అని చెప్పుకుంటున్న మోదీ మంత్రివర్గంలో 16 మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని రఘువీరా ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆందోళనలు చేస్తున్నామని ఆయన వివరించారు.