జగన్పై దేవినేని ఫైర్, ఆ జోస్యం నిజమౌతోందా.. టీడీపీలో చేరి బాధపడ్డ వైసిపి ఎమ్మెల్యే!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మంగళవారం నిప్పులు చెరిగారు. జగన్వి అర్థం పర్థం లేని మాటలని, ఆయనకు ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత లేదన్నారు.
ఫిరాయింపుదారులను ఇబ్బంది పెడుతున్న టిడిపి నేతల వ్యాఖ్యలు
2014 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే, ఆయా నియోజకవర్గాలలో వారికి ఇంఛార్జుల నుంచి చిక్కులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది.
టిడిపిలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో ఇంఛార్జులు, ఇంఛార్జులతో టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు చిక్కులు ఎదుర్కొంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.
పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పొద్దుతిరుగుడు పూలతో పోల్చారు.
బెల్లం చుట్టూ ఈగలు, చీమలు మూగినట్లే అధికారంలో ఉన్న పార్టీ చుట్టూ ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా మూగుతుంటారని, కేవలం అధికారం కోసమే పార్టీలోకి వచ్చి చేరుతున్న అటువంటి వారి పట్ల అధిష్టానం అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమన్నారు. ఆయన వ్యాఖ్యలకు నొచ్చుకున్న కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు పోయారని తెలుస్తోంది.
ఇప్పటికే కడపలో ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బా రెడ్డి, కర్నూలులో భూమా నాగిరెడ్డి వర్సెస్ శిల్బా సోదరులుగా ఉంది. ఇలా చాలాచోట్ల ఇంఛార్జులకు, ఎమ్మెల్యేలకు పోటాపోటాగా ఉంది.
ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు స్వయంగా చేరికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో టిడిపిలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో అవమానం తప్పదన్న మేకపాటి జోస్యం నిజమయ్యేలా కనిపిస్తున్నాయంటున్నారు.