సిక్కోలులో వైసిపికి ఎదురుగాలి: ధర్మానని జగన్కు దూరం చేసే కుట్రనా
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నుంచి తనను విడదీసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాద రావు గురువారం నాడు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి తనను పక్కకు తప్పించాలని చూస్తున్నారన్నారు.
కడపలో నేనైనా గెలుస్తా, ఇక్కడ జగన్కు ఈజీ కాదు: ధర్మాన సంచలనంవైయస్ జగన్ పైన ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ధర్మాన స్పందించారు. కొన్ని పత్రికల యాజమాన్యాలు పని కట్టుకొని తన పైన కుట్ర పన్నుతున్నాయన్నారు. అవాస్తవ కథనాలతో బలహీనపర్చాలనుకుంటున్నాయన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే బీసీలు అధికంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి జరిగిందన్నారు. పద్నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లాకు ఒక్కటంటే ఒక్క శాశ్వత పథకాన్ని ఇవ్వలేదని విమర్శించారు.
తప్పుడు వార్తలు ప్రచురించి వైసిపిని బలహీనపరిచే కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు అధికంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో జరిగిన అభివృద్ధి అంతా వైయస్ రాజశేఖర రెడ్డి చలువే అన్నారు.
కాగా, వైయస్ జగన్ కడప జిల్లాలో తప్ప ఎక్కడా గెలవలేరని, అక్కడ నేను కూడా గెలుస్తానని, శ్రీకాకుళంలో జగన్ కూడా గెలవలేరని ధర్మాన అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు, సిక్కులులో వైసిపికి ఎదురు గాలి అంటూ కూడా ప్రచారం జరిగింది. జగన్ తీరును నిరసిస్తూ పలువురు కార్యకర్తలు నినాదాలు చేశారని, జగన్ తన మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పినట్లుగా పుకార్లు షికార్లు చేశాయి.