సుజనాకు పదవా, బిజినెస్ క్లాస్: బాబుపై ధర్మాన
హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు అన్యాయం జరిగిందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. మొదట అశోక్ గజపతి రాజుకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి టిడిపి బిసీలకు అన్యాయం చేసిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి దృష్టిలో బీసి అంటే బిజినెస్ క్లాస్ అని ఆయన వ్యాఖ్యానించారు. విస్తరణలో అవకాశం వస్తుందని ఎదురు చూసినవారికి నిరాశే మిగిలిందని ఆయన అన్నారు. సుజనా చౌదరి వంటి వ్యాపారవేత్తను కేంద్ర మంత్రిని చేసిన వైనానికి తాము విస్తుపోతున్నట్లు ఆయన తెలిపారు
అధికారంలోకి రాక ముందు బీసీ జపం చేసిన చంద్రబాబు కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు స్థానం ఎందుకు కల్పించలేదని ఆయన అడిగారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తికి పదవులు కట్టబెట్టడం చూస్తే చంద్రబాబు వైఖరి అర్థమవుతుందని అన్నారు. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు
టిడిపి 21 మందిని రాజ్యసభ సభ్యులుగా చేసిందని,త వారిలో నలుగురైదుగురు మాత్రమే బీసిలు ఉన్నారని ఆయన అన్నారు. సుజనా చౌదరిపై ఓ దినపత్రికలో అనేక కథనాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అలాంటి నేతను చంద్రబాబు కేంద్ర మంత్రిని చేశారని ఆయన అన్నారు. అధికారం, పార్టీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు తాపత్రయపడుతున్నారని ఆయన అన్నారు. ఒక్క వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని కృష్ణదాస్ అన్నారు.