చంద్రబాబు అందులో నిపుణుడు: జగన్ దీక్షకు దిగ్విజయ్ మద్దతు
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో రాజకీయ విభేదాలున్నా... ఆయన చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు దిగ్విజయ్సింగ్ అన్నారు.
మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. జగన్ తన ప్రాణాలను ఫణంగా పెట్టొద్దని ఆయన సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. ఏపీ నుంచి కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడుతామని చెప్పారు.
ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకుండా రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎలా ప్యాకేజీలు ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. అమలుకాని హామీలు ఇవ్వడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిపుణుడు అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. తన కుటుంబం కోసమే కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నట్లుగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని దిగ్విజయ్ విమర్శించారు.