రంగంలోకి వారసులు: 2019లో పవన్ , అస్మిత్ లను బరిలో దింపనున్న జెసి బ్రదర్స్?
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారా లేదా అనేది జిల్లాలో హట్ టాపిక్ గా మారింది. అయితే తాను రాజకీయాలనుండి తప్పుకొంటే తన స్థానంలో తన కుమారుడు పవన్
అనంతపురం: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారా లేదా అనేది జిల్లాలో హట్ టాపిక్ గా మారింది. అయితే తాను రాజకీయాలనుండి తప్పుకొంటే తన స్థానంలో తన కుమారుడు పవన్ ను రాజకీయాల్లోకి తీసుకొస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు దివాకర్ రెడ్డి పకడ్బందీ వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నారనే ప్రచారం ఆయన సన్నిహితుల్లో వ్యక్తమౌతోంది.మరో వైపు తాడిపత్రి నియోజకవర్గం నుండి కూడ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీచేస్తారని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే రానున్న ఎన్నికల్లో జెసి బ్రదర్స్ తన వారసులను రాజకీయాల్లోకి తీసుకురావడం ఖాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
గత ఎన్నికల సమయంలోనే తాను రాజకీయాల నుండి తప్పుకొంటాననే అభిప్రాయాన్ని జెసి దివాకర్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు ప్రచారంలో ఉంది. అయితే అదే సమయంలో పార్టీ మారడం, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారడంతో ఆయన ఎంపీగా పోటీచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అంటుంటారు.
సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జెసి దివాకర్ రెడ్డి గత ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు.
రాష్ట్ర విభజన కావడం, కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపై పోటీచేస్తే ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి టిడిపిలో చేరారు.జెసి అనంతపురం ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆయన సోదరుడు తాడిపత్రి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2019 లో పవన్ రాజకీయరంగ ప్రవేశం
జెసి దివాకర్ రెడ్డి ... తనయుడు పవన్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లో ప్రవేశించేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ మేరకు తన రాజకీయ వారసత్వాన్ని కొడుకుకు అప్పగించేందుకుగాను జెసి ప్రయత్నాలను చేసినట్టు సమాచారం.రాజకీయాలపై విరక్తి కలుగుతోందని జెసి అప్పుడప్పుడూ చెబుతున్నాడు. అయితే ఇదే సమయంలో తనయుడు పవన్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకుగాను ఆయన అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే వపన్ కూడ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసేందుకు గాను ఏర్పాట్లు చేసుకొంటున్నారు.సేవా కార్యక్రమాలతో పవన్ బిజీగా ఉంటున్నారు.
అనంతపురం రూరల్ స్థానం నుండే పవన్
వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందని టిడిపి నాయకులు చెబుతున్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అనంతపురం రూరల్ స్థానం నుండి పవన్ బరిలోకి దిగే అవకాశం ఉందని జెసి సన్నిహితులు చెబుతున్నారు.రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందని జెసి సన్నిహితులు భావిస్తున్నారు.
రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నందున
అనంతపురం రూరల్ నియోజకవర్గం ఏర్పాటైతే రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో రూరల్ నియోజకవర్గమైతే పవన్ కు కలిసివచ్చే అవకాశం ఉంటుందని జెసి దివాకర్ రెడ్డి భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సులభంగా విజయం సాధించే స్థానం పై కేంద్రీకరిస్తే తమకు రాజకీయంగా పవన్ కు కలిసివచ్చే అవకాశం ఉందని జెసి భావిస్తున్నారు.
తాడిపత్రిలో అస్మిత్ రెడ్డి
తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కూడ తన వారసుడు ఆస్మిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుండి బరిలోకి దింపే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. ఆస్మిత్ ఇప్పటికే తాడిపత్రిలో కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. అన్నీ కలిసివస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనను తాడిపత్రి నుండి ప్రభాకర్ రెడ్డి బరిలోకి దింపే అవకాశాలున్నాయి. కౌన్సిలర్ గా పనిచేస్తున్నందున వచ్చే ఎన్నికల నాటికి ఆస్మిత్ రాజకీయాల్లో మరింత రాటుదేలే అవకాశాలు లేకపోలేదని ఆయన జెసి సన్నిహితులు అంటున్నారు.