అసలు మీకు తెలుసా: జగన్పై కోడెల అసహనం, 'తెలంగాణలోనే ఎక్కువ, కష్టాలు కోరుకుంటారు'
హైదరాబాద్: ఈ సభ మీ ఒక్కరిదే కాదని, మీకు స్వల్ప కాలిక చర్చ అంటే తెలుసా? అని సభాపతి కోడెల శివప్రసాద రావు గురువారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిను ప్రశ్నించారు. సభలో కరవు పైన చర్చ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా జగన్ చాలాసేపు మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో సభాపతి కల్పించుకున్నారు. కోడెల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జగన్ పట్టిసీమ, పోలవరం అంశాలపై మాట్లాడటానికి యత్నించడంతో పాటు తనకు ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత కూడా మాట్లాడేందుకు యత్నించారు.
ఈ సందర్భంగా స్పీకర్ కల్పించుకుని... ఈ సభ మీ ఒక్కరిదే కాదన్నారు. గంటల తరబడి మాట్లాడుతాను అంటే ఎలా అని ప్రశ్నించారు. మిగతా సభ్యుల పరిస్థితి ఏమిటన్నారు.
స్వల్ప కాలిక చర్చ అంటే మీకు తెలుసా అని ప్రశ్నించారు. స్వల్ప కాలిక చర్చలో తక్కువ సమయమే ఉంటుందన్నారు. దానిని అందరు పాటించాలన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల పైన నిన్ననే చర్చ జరిగిందన్నారు. నిన్న చర్చ సమయంలో మీరు సభలో లేరని గుర్తు చేశారు.
ఏపీ కంటే తెలంగాణలో ఎక్కువ
కరవు పైన చర్చ సందర్భంగా మంత్రి పత్తిపాటి పుల్లారావు, సీనియర్ సభ్యుడు కాల్వ శ్రీనివాసులు సభలో మాట్లాడారు. ఏపీ కంటే తెలంగాణలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు ఉన్నాయన్నారు. మహారాష్ట్ర ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. ఇది టిడిపి ఘనత అన్నారు. మన రాష్ట్రంలో ఆత్మహత్యలు తక్కువగా ఉన్నాయన్నారు.
జగన్ జీవితమంతా ఓదార్పు కోసమే సరిపోతుందని, అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. విపత్తులు సహా ప్రతిదానిని రాజకీయం చేయడం జగన్, వైయస్లకే తెలుసన్నారు. ప్రజలకు కష్టాలు రావాలని ఈ రాష్ట్రంలో కోరుకునే వారు ఎవరైనా ఉన్నారా అంటే.. అది జగన్ మాత్రమే అన్నారు.
రైతులకు రుణాలు వద్దని కేంద్రానికి చెప్పిన ఘనత వైయస్దే అన్నారు. మేం రుణమాఫీ ప్రకటిస్తే జగన్ వ్యతిరేకించారన్నారు. రైతులకు రుణమాఫీ చేయడం జగన్కు ఇష్టం లేదన్నారు. చనిపోయిన వారి పేరిట యాత్రలు జగన్కు అలవాటు అన్నారు. రైతుల కష్టాలను రాజకీయానికి, స్వార్థానికి వాడుకోవడం వైయస్ కుటుంబానికే చెల్లిందన్నారు. ఆత్మహత్యలపై రాజకీయాలు వద్దన్నారు.
కరవు నేపథ్యంలో విత్తనాలను సగం ధరకే ఇస్తున్నామన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. లక్షలు ఇస్తున్నామన్నారు. ఉద్యానవన తోటలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. తాగునీటి సమస్య లేకుంటా చర్యలు తీసుకుంటున్నామన్నారు.