వైద్యం సరిగా చేయలేదని డాక్టర్ కాళ్లు, చేతులు విరిచారు
మెదక్: వైద్యం సరిగా చేయలేదని ఆగ్రహించిన ఓ రోగి బంధువులు, అతనికి వైద్యం చేసిన వైద్యుడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఈ ఘటన మెదక్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్పత్రికి తీసుకువచ్చిన ఒక రోగికి డాక్టర్ ఆశీర్వాదం వైద్యం చేశారు. అయితే సరైన చికిత్స చేయలేదని ఆరోపిస్తూ రోగి బంధువులు ఆయనపై దాడికి దిగారు.
ఈ దాడిలో డాక్టర్ కాళ్లు, చేతులు విరిగి, పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం అతడ్ని హైదరాబాద్కు తరలించారు. కాగా, డాక్టర్ ఆశీర్వాదంపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సెల్ ఛార్జింగ్ పెడుతూ.. వ్యక్తి మృతి
సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురివి మండలం సూదరపల్లి గ్రామ పరిధిలోని బోడబూకయతండాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. తండాకు చెందిన బూక్యా రాందాస్(30) ఉదయం సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్కూటై షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
580 గ్రాముల బంగారం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మహిళ వద్ద అధికారులు తనిఖీలు చేపట్టగా 580 గ్రాముల బరువు కలిగిన బంగారు ఆభరణాలు బయటపడ్డాయి.