15న టిడిపిలోకి డొక్కా! రాయపాటి రాయబారం, చంద్రబాబు ఓకే
గుంటూరు: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ నెల 15వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు రంగం సిద్ధమైందని అంటున్నారు.
డొక్కా పార్టీలోకి రావడం వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శనివారం నాడు ఎంపీ రాయపాటి సాంబశివ రావు వివరించినట్లుగా తెలుస్తోంది. డొక్కాను చేర్చుకునేందుకు సిఎం చంద్రబాబు అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాక డొక్కా కొద్ది రోజులు తన రాజకీయ భవితవ్యంపై మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి.
డొక్కా వైసిపిలోకి వెళ్లకుండా రాయపాటి సాంబశివ రావు ఆపినట్లుగా తెలుస్తోంది. తాను వైసిపిలో చేరుతాననే వార్తల పైన డొక్కా ఇటీవల స్పందించారు. తాను వైసిపిలోకి వెళ్లడం లేదని, రాజకీయాలకంటే గురువు రాయపాటి ముఖ్యమని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన టిడిపిలోకి వస్తారని తెలుస్తోంది.