ప్రత్యేక హోదాతో పోల్చొద్దు: పురంధేశ్వరి, ఢిల్లీకి చంద్రబాబు, గవర్నర్
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఆదివారం నాడు అన్నారు. ప్రత్యేక హోదాతో అభివృద్ధిని పోల్చడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులను ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పురంధేశ్వరి చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సూచనల వల్లనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కావడం లేదని ఆమె అన్నారు.
ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీలో రేపు ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం పదకొండు గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. సాగరమాల ప్రాజెక్టు పైన మంత్రికి వివరించనున్నారు. అనంతరం మూడు గంటలకు అంతర్గత నదీ జలాల చైర్మన్తో భేటీ కానున్నారు. సాయంత్రం ఐదున్నరకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.
రాయలసీమపై కుట్ర: బైరెడ్డి
రాయలసీమ పైన ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కర్నూలులో విమర్శించారు. జిందాల్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చారని నిరూపిస్తే తాను ఉద్యమాన్ని విరమించుకుంటానని సవాల్ చేశారు. శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగుల నీటి మట్టం ఉండేలా ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.