అక్కడ నువ్వెందుకు స్నానం చేయలేదో చెప్పు, గీత దాటకు: జగన్కు షాకిచ్చిన బాబు
హైదరాబాద్: అసెంబ్లీలో గోదావరి పుష్కరాల ఘటనను రాజకీయం చేయాలని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చూశారని, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. ఆయన జగన్ తీరు పైన ఘాటుగా స్పందించారు.
అసెంబ్లీ వాయిదా అనంతరం చంద్రబాబు మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ విషయమై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత జగన్ ప్రతి అంశాన్ని వివాదం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ లాంటి వారిని తాను చాలామందిని చూశానని చెప్పారు.
సంతాప తీర్మానాలను కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ గీత దాటనంత వరకు ఉపేక్షిస్తామని, గీత దాటితే ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదన్నారు. పుష్కర ఘాట్ ప్రమాదం పైన తాను ఇప్పటికీ బాధపడుతున్నానని చెప్పారు.
పదేపదే తాను విఐపి ఘాట్లో పుష్కర స్నానం ఎందుకు చేయలేదని జగన్ ప్రశ్నిస్తున్నారని, మరి ఆయన విఐపి ఘాట్లో కాకుండా కొవ్వూరులో పుష్కర స్నానం ఎందుకు చేశారో చెప్పాలని ధీటుగా ప్రశ్నించారు. గీత దాటితే ఊరుకునేది లేదని మాత్రం ఆయన హెచ్చరించారు.
విఐపి ఘాట్లో స్నానం చేయకపోవడంపై వివరణ ఇస్తూ.. ఘాట్లో కంచి పీఠాధిపతి పూజల వల్లనే తాను పక్క ఘాట్లో స్నానం చేయవలసి వచ్చిందన్నారు. ప్రతి అంశాన్ని వివాదం చేస్తూ, రెచ్చగొట్టే ప్రయత్నాలు జగన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తర్వాత రోజు నుంచి పుష్కరాలను ప్రజలు హర్షించారన్నారు.
పుష్కరాల తొలి రోజు జరిగింది పొరపాటు మాత్రమేనని, తప్పిదం కాదన్నారు. జగన్ మంచి సలహాలు ఇస్తే తాను హర్షించేవాడినని చంద్రబాబు చెప్పారు. కానీ, ఆయన ప్రతి దానిని రాజకీయం చేస్తున్నారన్నారు. పుష్కర ఘాట్లో జరిగిన ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు తాము పరిహారం ఇచ్చామన్నారు.
విఐపి ఘాట్లో కాకుండా జగన్ కొవ్వూరు ఘాట్లో ఎందుకు స్నానం చేయవలసి వచ్చిందో మొదట చెప్పాలని నిలదీశారు. పుష్కర ఘాట్ ప్రమాదం జరిగిన రోజు తాము అతివేగంగా స్పందించామన్నారు. జగన్ మంచి సలహాలివ్వకపోవడం రాష్ట్రమంతటికీ దురదృష్టకరమన్నారు.
అన్ని అంశాల పైన చర్చల సమయంలో తగిన సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గన్ పదేపదే రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు. అది ఆయన అపరిపక్వతకు నిదర్శనమన్నారు. కంచి పీఠాధిపతి పుష్కర ఘాట్లో ఉండబట్టే తాను కూడా అక్కడకు వెళ్లానని, మరో కారణం లేదన్నారు.