కరణం కు బాబు షాక్: అద్దంకిలో జోక్యం చేసుకోవద్దు, నారాయణరెడ్డి హత్యపై కర్నూల్ నేతలకు క్లాస్
తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకొంటున్న ఘటనల పట్ల పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. గీత దాటితే ఇక సహించబోనని బాబు పార్టీ నాయకులను హెచ్చరించారు.
అమరావతి:తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకొంటున్న ఘటనల పట్ల పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. గీత దాటితే ఇక సహించబోనని బాబు పార్టీ నాయకులను హెచ్చరించారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య ఘర్షణ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కరణం బలరాం వ్యవహరశైలిని ఆయన తప్పుబట్టారు. మరో వైపు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఇక ఉదారంగా వ్యవహరించబోనని బాబు పార్టీ నాయకులను హెచ్చరించారు.ఇటీవల కాలంలో పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నతీరు పార్టీకి మచ్చతెచ్చేలా ఉన్నాయని చంద్రబాబునాయుడు అభిప్రాయపడుతున్నారు. నాయకులు అనుసరిస్తున్న తీరు ప్రతిపక్షాన్ని ప్రచారాస్త్రాన్ని అందిస్తోందని బాబు అభిప్రాయపడ్డారు. ఈ తీరు మారాల్సిన అవసరం ఉందని బాబు పార్టీ నాయకులకు సూచించారు.
వరుసగా టిడిపిలో చోటుచేసుకొంటున్న పరిణామాలు బాబు ఆగ్రహానికి కారణమయ్యాయి. కడప, కర్నూల్, ప్రకాశం జిల్లాల నాయకుల మధ్య సమన్వయం లేకుండాపోయింది. కృష్ణా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారుల పట్ల వ్యవహరించిన తీరు కూడ వివాదాస్పదంగా మారింది.
ఈ పరిణామాలన్నింటిపై ఎప్పటికప్పుడు పార్టీ నాయకులకు సూచనలను చేస్తున్నా వారు పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలోనే బాబు తీవ్రంగానే స్పందించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఇక చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు.
కరణం బలరాంకు బాబు షాక్
ప్రకాశం జిల్లా వేమవరంలో హత్యోదంతం తర్వాత కరణం బలరాం వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. ఒంగోలులో జరిగిన ఘర్షణలో కూడ ఆయన వైఖరిని తప్పుబట్టినట్టు సమాచారం. అద్దంకి నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని తాను ఎంత చెప్పినా వినకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బలరాం కుమారుడికి ఒక సీటు కేటాయిస్తానని చెప్పారనని బాబు గుర్తుచేశారు. ఎమ్మెల్సీ పదవిని బలరాంకు ఇచ్చిన విషయాన్ని కూడ బాబు ప్రస్తావిస్తున్నారు.వారికి ఇవ్వాల్సింది ఇస్తూ అద్దంకి నియోజకవర్గాన్ని రవికుమార్ కు వదిలేయాలని స్పష్టత ఇచ్చినట్టు బాబు చెప్పారు.అయితే తమ ధోరణిలోనే పార్టీ నాయకులు వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు.ఒంగోలు ఘటనపై విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొంటామని బాబు చెప్పారు.
ఒంగోలు ఘటనపై మంత్రులతో బాబు టెలికాన్పరెన్స్
మంగళవారం సాయంత్రం ఒంగోలు ఘటనపై మంత్రులు పి.నారాయణ, పరిటాల సునీత, శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా నేతలతో బాబు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. జిల్లా మినీ మహనాడును అర్ధాంతరంగా వాయిదా వేయడంపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. గొడవకు భయపడి వాయిదా వేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. అందరితో విడివిడిగా మాట్లాడడం కోసమే ఒకరోజు మహనాడును వాయిదా వేసినట్టు మంత్రి నారాయణ బాబుకు వివరణ ఇచ్చారు.
.నారాయణరెడ్డి హత్యపై బాబు క్లాస్
కర్నూల్ జిల్లా పత్తికొండ వైసీపీ ఇన్ చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూల్ జిల్లాకు చెందిన పార్టీ నాయకులకు సీరియస్ గా క్లాస్ తీసుకొన్నారు.నారాయణరెడ్డి హత్యను టిడిపికి అంటగట్టాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తే ఎందుకు ధీటుగా సమాధానం చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. నారాయణరెడ్డిని వ్యక్తిగత కక్షల నేపథ్యంలో హత్యకు గురయ్యారని ఈ విషయాలను ఎందుకు చెప్పలేకపోయారని బాబు పార్టీ నాయకులను నిలదీశారు.రాజకీయ ప్రయోజనం కోసం జగన్ గవర్నర్ వద్దకు వెళ్ళి హడావుడి చేశారని బాబు ఆరోపణలు చేశారు.ఇలాంటి విషయాలపై సమాచారం ఉన్నవారు స్వచ్చంధంగా స్పందించాలని బాబు పార్టీ నాయకులకు సూచించారు.
జగన్..మోడీ భేటీపై అతిగా స్పందించారు
తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ప్రధానమంత్రి మోడీతో వైసీపీ చీఫ్ జగన్ సమావేశం కావడంపై పార్టీ నాయకులు అతిగా స్పందించారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. విపక్ష నేతగా జగన్ కు మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చి ఉండొచ్చు. దానికి ఆయన్ను ఆక్షేపించడం సరైందికాదన్నారు.అవినీతికి వ్యతిరేకంగా ఉంటున్న మోడీ జగన్ తో ఎందుకు కలుస్తారని బాబు ప్రశ్నించారు.అయితే మిత్రపక్షంపై మాట్లాడేసమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బిజెపితో పొత్తు విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేశినేని వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. పొత్తు విషయాన్ని తాను చూసుకొంటానని బాబు చెప్పారు.
అధికారులతో జాగ్రత్త
జిల్లాల్లో అధికారులతో ఏమైనా ఇబ్బందులు, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని బాబు సూచించారు. అంతేకాని, నేరుగా అధికారులతో ఘర్షణలకు దిగడం సరైందికాదన్నారు బాబు. పశ్చిమగోదావరి జిల్లలాలో ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య చోటుచేసుకొన్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. దేనినీ మీ చేతుల్లోకి తీసుకోకూడదని ఆయన హితవు పలికారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు కూడ అతిగానే స్పందించారని బాబు అభిప్రాయపడ్డారు.