'అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో పెట్టడం చంద్రబాబుకు అలవాటే'
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మండిపడ్డారు. ఓ టీవీ చానెల్కి ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థాయికి తగ్గట్టు వ్యవహరించడం లేదన్నారు.
నిద్ర లేచిన దగ్గర నుంచి తనను బూతులు తిట్టే కేసీఆర్ దగ్గరకు స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తానన్న చంద్రబాబుకు, సొంత రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేతలు కనపడడం లేదని ధ్వజమెత్తారు. అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో పెట్టడం చంద్రబాబుకు బాగా అలవాటేనని మండిపడ్డారు.
సొంత రాష్ట్రంలో ఉన్న విపక్షాలను పట్టించుకోకుండా, తెల్లారి లేచింది మొదలు తిట్టేవారికి పెద్దపీట వేయడంలో చంద్రబాబు అభిమతం తెలుస్తుందని ఆయన తెలిపారు. ముందు రాజధాని నిర్మాణంలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయడం తెలుసుకోవాలన్నారు.
నవ్యాంధ్ర రాజధాని తెలుగుదేశం పార్టీకి మాత్రమే సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయమని సీఎం గుర్తించాలన్నారు. విపక్షాలను కలుపుకుని పోవాలని, మీడియా ద్వారా విపక్షాలు విషయాలు తెలుసుకునే దుస్థితి రాకూడదని ఆయన పేర్కొన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం మొత్తం ఓ రహస్య ఏజెండాగా జరుగుతోందని ఆయన ఆరోపణలు చేశారు. అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ను తానే స్వయంగా వెళ్లి కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేస్తానని మంత్రులతో చంద్రబాబు అన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తగ్గి సోదర భావం ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వస్తారో, లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. అక్టోబర్ 22న జరిగే రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.