ఈసీ హెచ్చరిక: చానళ్లకు నంద్యాల 'సర్వే' షాక్, రిజైన్పై అఖిలప్రియ మెలిక
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రీ పోల్ సర్వే ప్రసారం చేసేందుకు ప్రముఖ తెలుగు ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సిద్ధమైంది. అంతలోనే ఈసీ ఆదేశాల నేపథ్యంలో సర్వేను ప్రసారం చేయలేకపోయింది.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రీ పోల్ సర్వే ప్రసారం చేసేందుకు ప్రముఖ తెలుగు ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సిద్ధమైంది. అంతలోనే ఈసీ ఆదేశాల నేపథ్యంలో సర్వేను ప్రసారం చేయలేకపోయింది.
ప్రీ పోల్ సర్వేను ఆదివారం రాత్రి ఏడు గంటలకు ప్రసారం చేయాలని ఏబీఎన్ నిర్ణయించింది. దానికి కొద్దిసేపు ముందు ఈసీ భన్వర్ లాల్ స్పందించారు. సర్వేలు, ఒపీనియన్ పోల్స్ పైన నిషేధం విధించినట్లు చెప్పారు. దీంతో తాము సర్వేను ప్రసారం చేయలేకపోతున్నట్లు తెలిపింది.
ఫిర్యాదు అందింది, అందుకే ప్రసారం కాలేదు
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో సర్వేలు, ఒపీనియన్ పోల్స్పై నిషేధం విధించినట్టు భన్వర్ లాల్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఎవరికి ఓటు వేస్తారని అడగడం చట్టవిరుద్ధమన్నారు. సర్వేల పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం వంటి చర్యలకు దిగుతున్నారని తమకు ఫిర్యాదు అందిందని, ఈ నేపథ్యంలోనే సర్వేలు, ఒపీనియన్ పోల్స్ పైన నిషేధం విధించామన్నారు.
Recommended Video
ఏ ఛానల్ ప్రసారం చేసినా కఠిన చర్యలు
ఏ చానెల్ అయినా సర్వేలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భన్వర్ లాల్ హెచ్చరించారు. నంద్యాల ఉపఎన్నిక జరిగే ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకు ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించవద్దని, ప్రసారం చేయవద్దని చెప్పారు. సర్వేలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలకు విఘాతమన్నారు.
డిఎస్పీ బదలీపై
నంద్యాలలో ఓ డిఎస్పీని బదలీ చేశారు. దీనిపై కూడా భన్వర్ లాల్ స్పందించారు. వైసిపి ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనను బదలీ చేయలేదన్నారు. తమ విచారణలో డిఎస్పీది తప్పు అని తేలిందన్నారు.
రాజీనామాపై అఖిలప్రియ ట్విస్ట్
వైసిపి నుంచి గెలిచి, టిడిపిలో చేరిన అఖిలప్రియ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని వైసిపి డిమాండ్ చేస్తోంది. దీనిపై అఖిల ట్విస్ట్ ఇచ్చారు. తాను రాజీనామాకు సిద్ధమని అఖిల ప్రకటించారు. కానీ ఆమె మెలిక పెట్టారు. 2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డ ప్రజలు వైసిపిని చూసి ఓటేయలేదని, భూమా కుటుంబాన్ని చూసి ఓటేశారన్నారు.
జగన్ అర్థం కాలేదని
వైయస్ జగన్ అర్థం కాలేదని, అందుకే పార్టీ మారామని, ఆయన నద్యాలలో ఎవరి కోసం తిరుగుతున్నారో అర్థం కావడం లేదని అఖిలప్రియ అన్నారు. శిల్పాను గెలిపించుకునేందుకు తిరుగుతున్నారా లేక మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు.