దాసరికి కోల్ షాక్: రూ.2.25 కోట్ల ఆస్తుల జఫ్తు, అప్పుడేమన్నారు?
న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావుకు పెద్ద షాక్. బొగ్గు కుంభకోణం కేసులో దాసరికి చెందిన రూ.2.25 కోట్ల ఆస్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాడు అటాచ్ చేసింది. బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్లు, రెండు వాహనాలు, ఓ ఫ్లాట్, ఇతర ఆస్తులను తాత్కాలికంగా జఫ్తు చేసింది.
దాసరి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ కంపెనీ పట్ల పక్షపాతం చూపించారని దాసరి పైన ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతని ఆస్తులను తాత్కాలికంగా జఫ్తు చేసింది. బొగ్గు కుంభకోణం సమయంలో దాసరి సహాయమంత్రిగా ఉన్నారు.
కాగా, దాసరి నారాయణ రావు ఆస్తుల అటాచ్మెంట్కు ఈడీ రంగం సిద్ధం చేసినట్లుగా వారం రోజుల క్రితం వార్తలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది. దాసరి బొగ్గుగునుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీకి ఆయాచిత లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని, జిందాల్ కంపెనీ నుంచి దాసరికి చెందిన సౌభాగ్య మీడియా కంపెనీకి రూ.2.25 కోట్లు క్విడ్ ప్రోకో రూపంలో అందాయని సీబీఐ నిర్ధారించింది.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు దాసరిని ఈడీ, సీబీఐ విచారించింది. సౌభాగ్య మీడియా కంపెనీ ఆస్తులను ఈడీ జప్తు చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. సోమవారం సాయంత్రానికి ఆస్తుల అటాచ్మెంట్కు సంబంధించిన ప్రకటనను ఈడీ వెలువరించే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
2006-2009 మధ్యకాలంలో బొగ్గు శాఖలో భారీ కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ద్వారా వెలుగు చూసిన విషయం తెలిసిందే. అప్పుడు దాసరి బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. గతంలో దాసరిని సీబీఐ హైదరాబాదులో ప్రశ్నించింది. అదే సమయంలో మరో మాజీ మంత్రి సంతోష్ బగ్రోడియాను కూడా ప్రశ్నించింది.
హిండాల్కోకు బొగ్గు కేటాయింపుల విషయంలో తన ప్రమేయం లేదని దాసరి నారాయణ రావు సీబీఐకి గతంలో వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో విచారణ జరుపుతున్న సిబిఐ ముందుకు దాసరి తనకు సహాయంగా గతంలో పిఎస్గా పని చేసిన అధికారిని కూడా తీసుకువెళ్లారు.
స్క్రీనింగ్ కమిటీ తమిళనాడుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్కు తలబిరా-2 బొగ్గు బ్లాకుల్ని కేటాయించిందని, తాను అదే నిర్ణయాన్ని సమర్థించానని దాసరి తెలిపారు. స్క్రీనింగ్ కమిటీలో వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారని, వారి నిర్ణయమే అంతిమమన్నారు. బొగ్గు కుంభకోణంలో తన ప్రమేయం లేదని, నలభై మందితో కూడిన కమిటీ ఓకే చేశాకనే తాను ఫైల్స్ పైన సంతకం చేశానని, తాను నిరపరాధిగా తేలుతానని గతంలో జరిగిన విచారణలో దాసరి చెప్పారు.