పులివెందులలో బైరెడ్డిపై గుడ్లు, చిరంజీవిపై రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందుల పర్యటనలో రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర రెడ్డికి సోమవారం నాడు చేదు అనుభవం ఎదురైంది.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు టిడిపి సర్కారు రైతుల రుణాలను, డ్వాక్రా రుణాలను ఎక్కడా మాఫీ చేయలేదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ కాలేదన్న బైరెడ్డిపై జనం కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో షాకైన బైరెడ్డి అర్ధాంతరంగా తన పర్యటనను ముగించుకున్నారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండంల పార్నపల్లెలో పర్యటించిన సందర్భంగా బైరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తొలుత లింగాల మండల కేంద్రంలో మాట్లాడిన ఆయన రాయలసీమ ప్రజల ప్రజల గొంతు కోసి ఆంధ్రాలో అమరావతి పేరుతో రాజధాని నిర్మిస్తున్నారన్నారు.
రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో టిడిపి హామీలు గుప్పించిందన్నారు. ఇప్పటివరకు రుణాల మాఫీ, జాబులు, నిరుద్యోగ భ్రుతి ఇచ్చిన దాఖలా ఎక్కడా కనిపించలేదన్నారు.
అటునుంచి పార్నపల్లె వెళ్లిన బైరెడ్డి లింగాలలో మాట్లాడారు. ఆగ్రహానికి గురైన గ్రామ యువకులు.. రుణాలు ఎక్కడ మాఫీ కాలేదో చెప్పాలని బైరెడ్డిని నిలదీశారు. అబద్ధ ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో ఆయన మధ్యలోనే వెనుదిరిగారు.
బాబు, జగన్లపై రామకృష్ణ ఆగ్రహం
రెండేళ్ల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కాపులను మోసం చేశారని సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ విమర్శించారు. మళ్లీ కాపుల ఓట్ల కోసం జగన్ ఇప్పుడు వారిని మోసం చేస్తున్నాడన్నారు.
రాజకీయాల కోసం ఈ ఇద్దరూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే వీరిద్దరూ కులాలను రెచ్చగొడుతున్నారన్నారు.
మధ్యలో చిరంజీవికి ఏం పోయేకాలం వచ్చిందో తెలియదు కానీ, గతంలో ఎన్నడూ కాపు సంక్షేమం కోసం మాట్లాడని చిరంజీవి ఇప్పుడు కొత్తగా కాపు ఉద్యమమని అంటున్నాడన్నారు. ప్రజలు విచక్షణతో ఆలోచించాలన్నారు. ముద్రగడ కూడా హడావుడిగా దీక్ష చేయడం సరైన నిర్ణయమో కాదో ఆలోచించాలన్నారు.