నిశ్చితార్థమై పది రోజులు. కొద్ది రోజుల్లో పెళ్లి... ఇంతలోనే ఘోరం
ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసుకుని, తమ వంశాన్ని నిలబెడతాడనుకుంటున్న తరుణంలో విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదంలో కొడుకు కూడా మరణించాడు. దీంతో అందరినీ పోగొట్టుకుని ఆ తల్లి అనాథగా మిగిలింది.
అనంతపురం: భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. ఇక ఆ ఇల్లాలికి మిగిలింది కొడుకొక్కడే. వెంటనే కుమారుడికి పెళ్లి చేసి, భర్త చనిపోయిన బాధ నుంచి బయటపడాలనుకుంది. పది రోజుల క్రితమే నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ అనుకున్నదే జరిగితే ఇది జీవితం ఎందుకవుతుంది?
ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసుకుని, తమ వంశాన్ని నిలబెడతాడనుకుంటున్న తరుణంలో విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదంలో కొడుకు కూడా మరణించాడు. దీంతో అందరినీ పోగొట్టుకుని ఆ తల్లి అనాథగా మిగిలింది. గుండెలు పగిలేలా రోదిస్తున్న ఆమెను ఎవరూ ఓదార్చలేకపోతున్నారు.
కదిరి పట్టణంలోని రాయలసీమ సర్కిల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గణేష్(26) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పట్టణ పరిధిలోని కుటాగుళ్ళకు చెందిన ఇతడు డిగ్రీ చదివాడు. మహీంద్ర ట్రాక్టర్ షోరూంలో పని చేస్తుండే వాడు. తండ్రి గంగప్ప మూడేళ్ల క్రితమే మరణించగా తల్లి రామసుబ్బమ్మకు గణేష్ ఆసరాగా ఉండేవాడు.
పెళ్లీడు రావడంతో పది రోజుల క్రితం సైదాపురానికి చెందిన యువతితో గణేష్ కు నిశ్చితార్థం జరిగింది. కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోవాల్సి ఉండగా శనివారం పట్టణంలోని రాయలసీమ సర్కిల్ వద్ద ద్వి చక్రవాహనంపై వెళ్తూ.. బెంగుళూరు బయల్దేరుతున్న కదిరి ఆర్టీసీ డిపో బస్సు కిందకు దూసుకెళ్లాడు.
ఈ రోడ్డు ప్రమాదంలో గణేష్ అక్కడికక్కడే మృతిచెందగా, విషయం తెలుసుకున్న ఎస్సై రాజేష్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, గణేష్ మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గణేష్ మృతి గురించి తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్దఎత్తున తరలివచ్చారు. గణేష్ తల్లిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఎస్పై రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.