వెనక నుంచి హరీష్: ఎర్రబెల్లి, రేవంత్ కళంకం: జూపల్లి
హైదరాబాద్: స్పీకర్ను వెనక నుంచి శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు నడిపిస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. తమ పార్టీకి శానసశభ ఆవరణలో కార్యాలయం కేటాయించకుండా హేళన చేయడం సరి కాదని ఆయన మంగళవారంనాడు మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ శాసనసభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
శాసనసభను హరీష్ రావు పరోక్షంగా నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు. సభలో అధికార టిఆర్ఎస్ వైఖరిపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇలా అసెంబ్లీని నడపడం చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులను చంకన పెట్టుకుని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాలన సాగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల వెనక వేరే హస్తం ఉందని వ్యాఖ్యానించడం సరి కాదని ఆయన అన్నారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
కాగా, డిఎల్ఎఫ్ భూముల వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపే బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. ఫలితంతో తనకు సంబంధం లేదని ఆయన అన్నారు. దాన్ని నిర్ణయించాల్సింది ప్రజలేనని వ్యాఖ్యనించారు.
రేవంత్ చెడ పుట్టాడు
రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో చెడ పుట్టాడని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు జూపల్లి కృష్ణారావు అన్నారు. రేవంత్ రెడ్డి వల్ల శానససభకు కళంకం ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. పాలమూరు గౌరవాన్ని కాపాడేలా రేవంత్ రెడ్డి వ్యవహరించాలని ఆయన సలహా ఇచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి పదే పదే అబద్ధాలు చెప్తే అవి నిజాలు కాబోవని ఆయన అన్నారు.
మెట్రో రైలు వెళ్లిపోతుందని ఆనాడు తప్పుడు ప్రచారం సాగించారని ఆయన గుర్తు చేశారు. సమైక్య పాలనలో భూములు అమ్మింది తెలంగాణలో కాగా ఖర్చు పెట్టింది మాత్రం ఆంధ్రలో అని ఆయన అన్నారు. ఈ రోజు ఆ డబ్బును తెలంగాణ టిడిపి నేతలు తీసుకుని రాగలరా అని ఆయన అడిగారు.
ఓబులేష్ మాదిరిగా డిఎల్ఎఫ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి దొరికిపోయాడని లక్ష్మారెడ్డి అన్నారు. ఇప్పటికై రేవంత్ రెడ్డి తన తప్పును అంగీకరించాలని ఆయన సూచించారు.