తెలంగాణ, బాబు: తలసానిపై బాంబుపేల్చిన ఎర్రబెల్లి, ఒక్కొక్కరి గురించి ఇలా
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు గురువారం నాడు మహానాడు వేదికగా ఓ బాంబు పేల్చారు! తెలంగాణ ఇవ్వాలని చంద్రబాబు రాసిన లేఖకు.. నాడు టీడీపీలో ప్రస్తుతం తెరాసలో ఉన్న నేతలు శ్రీనివాస్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కారణమని ఆరోపించారు.
తెరాస పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. పేదలకు ఇళ్లు ఎప్పుడు కట్టిస్తారో చెప్పాలన్నారు. కుటుంబం కోసమే కేసీఆర్ ఉద్యమాన్ని వాడుకున్నారన్నారు. కేసీఆర్.. ఖబడ్దార్, టీడీపీ నీ సంగతి తేలుస్తుందని హెచ్చరించారు.
ఉద్యమంలో తీవ్రంగా శ్రమించిన విద్యార్థులకు ఏం చేశారో చెప్పాలన్నారు. తెరాస మంత్రి వర్గంలో ఉన్న వారంతా తెలంగాణ ద్రోహులన్నారు. ఇప్పుడు వారికే పెద్దపీట వేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను కేసీఆర్ ఆదరించలేదన్నారు.
తెలంగాణ కోసం కడియం శ్రీహరి ఎప్పుడూ పోరాటం చేయలేదని, తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ జై తెలంగాణ అని ఎప్పుడూ అనలేదని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టో, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మహిళలు, దళితులను కేసీఆర్ మర్చిపోయారన్నారు.
తెరాస అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిగా చేయకుంటే మెడకాయ నరుకుంటానని చెప్పిన కేసీఆర్ ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితిల్లో ప్రజలు లేరన్నారు. పిచ్చి తుగ్లక్లా వ్యవహరిస్తున్నారు.
దమ్ము ధైర్యముంటే నలుగురు ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి గెలిపించాలని సవాల్ విసిరారు. వారిని గెలిపిస్తే, వచ్చే మహానాడులో కేసీఆర్ అభినందన సభను ఏర్పాటు చేస్తామన్నారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.
తెలంగాణలో తెరాసకు బలం పోయిందన్నారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీని గెలిపించే బాధ్యత తమదే అన్నారు. తెలంగాణలో నాయకులు పోయారే తప్ప, టీడీపీకి కేడర్ పటిష్టంగా ఉందన్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ జెండాను ఖచ్చితంగా ఎగురవేస్తామన్నారు. టీడీపీ ద్వారానే ముప్పు ఉందని కేసీఆర్ తమ పార్టీ వెంట పడుతున్నారన్నారు.