రేవంత్ రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టారు: పత్తిపాటి, 'జగన్ గద్వాల క్యాంప్ ఇలా'
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా తమ వద్ద ఆధారాలున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారంనాడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ టిడిపి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిని నెలరోజులు అక్రమంగా జైలులో పెట్టారని ఆయన ఆరోపించారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాదు నగరంలో సెక్షన్ 8 అమలు అవసరమని కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పొగాకు బోర్డుకు ఇచ్చిన ఇండెంట్ మేరకే పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మంత్రి కోరారు. బోర్డు ఇచ్చిన హామీల మేరకే రైతులు పొగాకు సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించినట్లు ఆయన చెప్పారు.
జులై 4వ తేదీన గుంటూరులో పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి తుది నిర్ణయం తీసుకుంటామని పత్తిపాటి పుల్లారావు చెప్పారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ను మరో కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు మంగళవారం కలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని పొగాకు రైతుల సమస్యలను నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. పొగాకు నిల్వలకు కనీస మద్దతు లభించేలా చర్యలు తీసుకోవాలని కోరామని వారు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అండతోనే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మహబూబ్నగర్ జిల్లా గద్వాల్లో క్యాంప్ నిర్వహిస్తున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్బాబు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గద్వాలలోనే ఎందుకు పెట్టుకోవాలని, కర్నూల్లోనే క్యాంప్ పెట్టుకోవచ్చు కదా అని ఆయన అన్నారు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం ఉందని అర్థమవుతోందని అన్నారు.
ఆ రహస్య ఒప్పందాన్ని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీపీ నేత రేవంత్రెడ్డికి బెయిల్ రావడం కూడా మా నైతిక విజయమని మంత్రి రావెల అన్నారు. రేవంత్కు బెయిల్ రాకుండా ఎన్నో కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. ఆ కుట్ర రాజకీయాలకు మీరే బలౌతారని ఆయన అన్నారు.