దారికి తెచ్చేందుకు కసరత్తు: చంద్రబాబు సూచన, సరేనని చెప్పిన బిజెపి
విజయవాడ/ఢిల్లీ: మిత్రపక్షాలతో మరింత దోస్తీగా ముందుకు వెళ్లాలని బిజెపి భావిస్తోంది. కాంగ్రెసేతర పక్షాలను ఓ దారికి తెచ్చేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. విడిగా భేటీలు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచిస్తున్నారని తెలుస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు పూర్తిస్థాయిలో అంతరాయం కలిగించాలని కాంగ్రెస్ యోచిస్తున్న నేపథ్యంలో మిత్రపక్షాలపై బిజెపి మరింత ప్రేమపూర్వక వైఖరిని కనబరుస్తోందని అంటున్నారు.
పార్లమెంటులో ప్రభుత్వానికి అన్ని విధాలా అండదండలు అందించాలంటే తమ రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అంశాలను పరిష్కరించాలంటూ టిడిపి, అకాలీ దళ్, శివసేన, ఎల్జేపీ వంటి భాగస్వామ్య పక్షాలు కోరుతున్నాయని తెలుస్తోంది.
సోమవారం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నివాసంలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి బిజెపి అధ్యక్షులు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ హాజరయ్యారు. తద్వారా 23న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో భాగస్వామ్య పక్షాల సాయం పొందడంపై బిజెపి అన్ని ప్రయత్నాలూ చేస్తోందని అంటున్నారు.
టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు, అకాలీ దళ్ అధ్యక్షులు సుఖ్బీర్ బాదల్ తదితరులు తొమ్మిది మిత్రపక్షాల తరఫున హాజరయ్యారు. సమావేశం గంటన్నరసేపు కొనసాగింది. ఈ సందర్భంగా మిత్రపక్షాలకు ఇచ్చిన హామీలపై చర్చ జరిగింది.
బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లుల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలన్నీ కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఎన్డీయే నేతల సమావేశంలో వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. చిన్నచిన్న పార్టీలను కలుపుకొని వెళ్లాలని, ఎన్డీయే చర్చల్లో భాగస్వామ్య పార్టీలకు అవకాశం ఇవ్వాలని నేతలు కోరారు.
బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం మాదిరిగా ఎన్డీఏ ఎంపీలతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ విధానాలు వివరిస్తే ప్రతిపక్షాల దాడికి అడ్డుకట్ట వేయవచ్చనే సూచనా వచ్చింది. కాగా, భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం పెరగడానికి ఇలాంటి సమావేశాలు తరచూ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించగా అమిత్ షా అంగీకరించారన్నారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, బెంగళూరులో విదేశీ యువతిపై దాడి, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిణామాలు కూడా చర్చలో వచ్చాయన్నారు. పార్టీలతో విడివిడిగా మాట్లాడాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదన మేరకు ముందుగా మంగళవారం అకాళీ దళ్, టిడిపి నేతలతో అల్పాహార విందుతో అమిత్ షా భేటీ కానున్నారని వెంకయ్య వివరించారు.