ప్రాణం తీసిన వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య
విజయవాడ: వివాహేతర సంబంధం ఆ బిడ్డలకు కన్న తల్లిని లేకుండా చేసింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన సుజాత(26)కు జగ్గయ్యపేట మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు(30)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య, భర్త తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా సుజాత అదే గ్రామానికి చెందిన నాగవేణు(20)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం సుజాత అటు కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను వదిలేసి వెళ్లిపోయింది.
దీంతో కుటుంబ సభ్యులు కంచికచర్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి ఆచూకీ కోసం వెతుకుతుండగా, పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు గ్రామ శివారులోని సుబాబుల్ తోటల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే సుజాత మృతి చెందింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగవేణుని వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నంచగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ కేసులో ఇద్దరూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.