వివాహేతరబంధం: అంతా చూస్తుండగా పట్టపగలే నడిరోడ్డుపై నరికి చంపారు, వీడియో తీసి..
కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఇద్దరు దారుణంగా కత్తితో నరికి చంపారు.
కడప: జిల్లాలోని ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఇద్దరు దారుణంగా కత్తితో నరికి చంపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే కోర్టు, పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం.
కోర్టు వాయిదాకు వెళ్తున్న మారుతి రెడ్డి అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు అతడ్ని దారుణంగా నరికి చంపారు. ఓ వ్యక్తి అతడ్ని కిందపడేసి పట్టుకోగా.. మరో వ్యక్తి అత్యంత దారుణంగా నరికి చంపాడు. అక్కడ భారీగా జనం ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.
ఓ యువకుడు అడ్డుకునే ప్రయత్నించినా.. నిందితుల వద్ద కత్తులను చూసి వారి దగ్గరకపోలేకపోయాడు. కొందరు అరుపులు కేకలు వేశారు గానీ, నిందితులను అడ్డుకోలేకపోయారు. అంతేగాక, మరికొందరైతే ఫొటోలు, వీడియోలు తీయడం గమనార్హం.
ఇది ఇలా ఉంటే.. నిందితుల్లో మరో ఇద్దరు మారుతి రెడ్డి హత్య జరుగుతుండగా వీడియో తీశారు. అంతేగాక, ఆ వీడియోలను మీడియాకు, పోలీసులకు ఇవ్వడం గమనార్హం. ఘటన జరిగిన అనంతరం నలుగురు నిందితుల్లో ఇద్దరు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
కాగా, మారుతి రెడ్డి కుటుంబంలో వారితో నిందితులకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గతంలో మారుతిరెడ్డి వారిని బెదిరింపులకు గురిచేశాడు. ఇప్పుడు వారే ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతుడు జమ్మలమడుగు మండలం దేవగుడి వాసి అని తెలిసింది.