బీ అలర్ట్: ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే అంతే.. నెల్లూరులో మోసపోయిన దంపతులు..
తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన భార్యభర్తలు ఈ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఏకంగా పొలాన్నే అమ్ముకున్నారు. చివరికి మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నెల్లూరు: ఊహించని ఫోన్ కాల్.. భారీ మొత్తంలో మనీ ఆఫర్.. నిజమే అనుకుని కమిట్ అయ్యారో దెబ్బయిపోవడం ఖాయం. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ఫేక్ కాల్స్ బెడద ఎక్కువైపోయింది. భారీ మొత్తంలో డబ్బు గెలుచుకున్నారనో.. భారీ గిఫ్టులు గెలుచుకున్నారనో ఫోన్ చేసి అమాయకులకు గాలం వేస్తున్న సంఘటనలు తరుచూ వార్తల్లోకి ఎక్కుతున్నాయి.
తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన భార్యభర్తలు ఈ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఏకంగా పొలాన్నే అమ్ముకున్నారు. చివరికి మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జలదంకి మండలం కమ్మవారిపాళెంకు చెందిన ఎం.రాఘవేంద్ర, ప్రసన్న దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవల టీవీల్లో వచ్చే ప్రకటనలకు ఆకర్షితులై.. నాప్టాల్ కంపెనీలో జ్యూయలరీ సె ట్, పంజాబీ డ్రస్లు, మొబైల్ కొనుగోలుకు ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చారు.
ఇంతలో సదరు కంపెనీ నుంచి వీరి మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది. మా సంస్థ తరుపున మీ మొబైల్ నంబర్ కు రూ.74లక్షల బంపర్ డ్రా తగిలిందనేది దాని సారాంశం. అది నిజమే అనుకుని నమ్మేసిన దంపతులు తిరిగి అదే నంబర్ కు ఫోన్ చేశారు.
డబ్బులు ఇస్తాం కానీ అంతకన్నా ముందు ట్యాక్స్, ఇతరత్రా సర్వీస్ చార్జీలు అన్ని కలిపి మొత్తం రూ.10లక్షల ఖర్చవుతాయని, అవి చెల్లించిన తర్వాత రూ.74లక్షలు చెల్లిస్తామని నమ్మబలకడంతో ఉన్న నాలుగెకరాల పొలంలో రెండెకరాల పొలం అమ్మి మరీ రూ. 8.6 లక్షలు చెల్లించారు. తీరా మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు.
వచ్చిన గిఫ్ట్ అయిన ఇప్పించండి లేకపోతే తమ డబ్బయినా వెనక్కి ఇప్పించండి అంటూ సోమవారం క్రైమ్స్ ఓఎస్డీ విఠలేశ్వర్రావును కలిసి బాధితులు విన్నవించుకున్నారు.