17 ఏళ్ల స్వామీజీ లీలలు: స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, కాపురాలు కూలుస్తూ..
గుంటూరు: ఓ యువకుడు స్వామీజీ అవతారం ఎత్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కాపురాలు కూల్చే పనిలో పడ్డారు. అతని అరాచాకాలకు తాళలేక ప్రజలు అతనికి దేహశుద్ధి చేసి, అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ 17 ఏళ్ల వయస్సు గల స్వామీజీపై తెలుగు టీవీ చానెళ్లలో శుక్రవారంనాడు వార్తాకథనాలు వచ్చాయి. తమ అబ్బాయికి అమ్మవారు ఒళ్లోకి వస్తారని తల్లిదండ్రులు ఆ యువ స్వామీజీపై ప్రచారం సాగించారు. దాంతో అతను రెచ్చిపోయాడు. గుంటూరు జిల్లాలో అతని ఆగడాలకు అంతు లేకుండా పోయింది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళతో ‘నువ్వు 3 నెలల గర్భవతివి. నీకు మగ పిల్లాడు పుడతాడు. ఆ అబ్బాయికి నాపేరు పెట్టుకో' అని చెప్పాడట. గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం చెరుకుపల్లి చెందిన రామారావు కుటుంబం రెండేళ్ల క్రితం బతుకు తెరువు కోసం నరసరావుపేటలోని శ్రీనివాస్నగర్కు వలస వచ్చారు. కొడుకుకి చదువు అబ్బకపోయేసరికి ఇటుకల బట్టీలో పనికి పెట్టారు. కష్టపడి పని చేయలేని రామారావు, తల్లిదండ్రులతో కలిసి తనను స్వామీజీగా పరిచయం చేసుకున్నాడు.
మున్సిపల్ ఆఫీసులో పనిచేసే ఓ మహిళ పిల్లలు పుట్టకపోవడంతో రామారావు దగ్గరకు వచ్చింది. "మీవారిని పంపించండి" ఆ స్వామీజీ ఆమెతో అన్నాడు. ఆ మహిళ తన భర్తను స్వామీజీ వద్దకు పంపించింది. అతను ఆమె భర్తతో ఆమెపై అవాకులు చెవాకులు పేలాడు. దీంతో ఆ వ్యక్తి స్వామీజీ చెప్పింది నిజమని నమ్మి మహిళకు విడాకులివ్వడానికి తన భర్త సిద్దపడ్డాడు. ఈ విషయాన్ని మహిళ తన కుటుంబ సభ్యలకు తెలియజేసింది.
విషయం విన్న మహిళ చిన్నమ్మ మన స్వామీజీ రామారావు దగ్గరకు వెళ్లింది. ఆమె కూడా తనకు పిల్లలు పుట్టడం లేదని చెప్పింది. ‘నువ్వు 3 నెలల గర్భవతివి. నీకు మగ పిల్లాడు పుడతాడు. ఆ అబ్బాయికి నాపేరు పెట్టుకో' అని ఆమెతో స్వామీజీ రామారావు చెప్పాడు. కానీ అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు.
పైగా ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని ఆరేళ్లు అయింది. దీంతో రామారావు బండారం బయటపడింది. అతడు స్వామీజీ కాదని, డబ్బు కోసం అబద్దాలు చెబుతూ కాపురాలు కూలుస్తున్నాడని మహిళ బంధువులు ఆరోపించారు. స్థానికులకు విషయం తెలియడంతో రామారావుకు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.