చిరు భవిష్యత్తుపై ఫ్యాన్స్ భేటీ, పవన్ ప్రస్తావన: నిలదీత
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆదివారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి రాజకీయ భవిష్యత్తు, సినిమాలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్... తదితర అంశాలపై చర్చించారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు, ఆయన తెలుగుదేశం పార్టీ - బీజేపీలకు మద్దతివ్వడం.. తదనంతర కార్యక్రమాల పైన చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ చిరు సోదరుడు నాగబాబు ఆధ్వర్యంలో జరిగింది.
చిరంజీవి గత కొద్ది రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల్లోను ఆయన నాలుగైదు రోజులు మాత్రమే రాజ్యసభకు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరు రాజకీయ భవిష్యత్తు, 150వ చిత్రం పైన చర్చించారని తెలుస్తోంది.
కాగా, ఈ భేటీలో నాగబాబు మెగా అభిమానుల ఆగ్రహాన్ని చవి చూసినట్లుగా ఊహాగాలు వినిపిస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఫంక్షన్లో దాసరి నారాయణ రావు చేసిన వ్యాఖ్యల పట్ల మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ స్పందించకపోవడాన్ని అభిమానులు నాగబాబును ప్రశ్నించారని సమాచారం. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మెగా కుటుంబం కలిసికట్టుగా ఉండాలని కోరారు.
దీనిపై నాగబాబు స్పందిస్తూ.. త్వరలో చిరు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజలను ఒకే వేదిక పైకి తెస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ సమావేశంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేకంగా చిరంజీవి అభిమాన సంఘం కొత్త కమిటీలను ప్రకటించారు.