వితౌట్ కోచింగ్: ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రైతు బిడ్డ
సంవత్సరాల పాటు అదే పనిగా చదువుకుంటే తప్ప ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టంగా మారిని ఈ పోటీ ప్రపంచంలో ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి..
విశాఖపట్నం: సంవత్సరాల పాటు అదే పనిగా చదువుకుంటే తప్ప ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టంగా మారిని ఈ పోటీ ప్రపంచంలో ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు విశాఖ యువకుడు. అతడే జిల్లాలోని ఎలమంచిలికి చెందిన కర్రి రఘనాథ శంకర్.
రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రెండు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి సంపాదించాడు శంకర్. ఈ ఘనత వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ఎలమంచిలి జలాల వీధికి చెందిన రఘునాథ శంకర్ తండ్రి సత్యనారాయణ సన్నకారు రైతు, తల్లి గృహిణి. శంకర్ పదో తరగతి వరకు ఎలమంచిలి ప్రభుత్వ పాఠశాలలో చదివారు.
ఈ తర్వాత కర్నూలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బయోమెడికల్ విభాగంలో చేరారు. 2010లో నిర్వహించిన ఈసెట్లో 32వ ర్యాంకు సాధించి విజయవాడ వీఆర్ సిద్దార్థ కళాశాలలో చేరి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సిద్ధమవుతూ 2016లో నిర్వహించిన పలు పోటీ పరీక్షలు రాశారు.
ఆదాయపు పన్నుశాఖ ఇన్స్పెక్టర్, రైల్వేలో కమర్షియల్ అధికారి ఉద్యోగాలు సాధించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్సై, జైలు వార్డర్ పోస్టులు రెండూ అతడిని వరించాయి. ఉద్యోగ సాధనలో భాగంగా శంకర్ ప్రత్యేకంగా ఎక్కడా శిక్షణ పొందకపోవడం గమనార్హం. ఎలమంచిలి గ్రంథాలయాన్నే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వేదిక చేసుకున్నాడు శంకర్.
వసతిగృహం సంక్షేమాధికారిగా పనిచేస్తున్న ఆయన మామయ్య అప్పలనాయుడు కూడా అతనికి విలువైన సూచనలందించారు. రోజుకు 7గంటలపాటు చదివానని, పుస్తకాల కోసం పెద్దగా ఖర్చు పెట్టలేదని శంకర్ చెబుతున్నారు. ప్రజలకు మంచి సేవలు అందించే లక్ష్యంతో ఎస్సై పోస్టులో చేరాలని నిర్ణయించుకున్నానని వివరించారు. తన తల్లిదండ్రులు, నాన్నమ్మ, మామయ్యల ప్రోత్సాహంతో తాను ఈ విజయాలు సాధించానని శంకర్ వినమ్రంగా చెప్పుకొచ్చాడు.