బ్యాంక్ ఎదుట రైతు ఆత్మహత్య, మామ వేధింపులతో కోడలు ఆత్మహత్య
హైదరాబాద్: అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో విషాదం చోటు చేసుకుంది. సిండికేట్ బ్యాంకు ఎదుట పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతుకు ఆత్మహత్యకు కారణం బ్యాంకు మేనేజర్ వేధింపులే కారణమని తెలుస్తోంది.
పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని సిండికేట్ బ్యాంకు మేనేజర్ శివశంకర్ వేధించడంతో తీవ్ర మనస్ధాపానికి గురైన కొదంరామిరెడ్డి అనే రైతు బ్యాంకు ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్ధానికులు అతడిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందాడు.
మేనేజర్ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు వైద్యులు తెలిపారు.
మహిళ ఆత్మహత్య: మామ వేధింపులే కారణమన్న తల్లి
విజయనగరంలో కృష్ణప్రియ అనే మహిళ గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యకు మామ వేధింపులే కారణమని మృతురాలి తల్లి డాక్టర్ కృష్ణకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామ తనను వేధిస్తున్నట్టు గత కొంతకాలంగా కుమార్తె తనతో మొరపెట్టుకుంటోందని చెప్పింది.
అతడి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తె చావుకి కారకులైన వారిని శిక్షించి న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.