బాబుకు షాక్: భూములిచ్చేందుకు నో, డిమాండ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూములు ఇచ్చే విషయంలో భూయజమానుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాజధానికి భూములు ఇచ్చేందుకు చాలామంది రైతులు సానుకూలత వ్యక్తం చేస్తున్నారంటున్నారు. అయితే, కొందరు రైతులు మాత్రం భూమిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారంటున్నారు.
సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కాంతీలాల్ దండే, ఆర్డీవో, తహశీల్దారు తదితరులు గుంటూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహానికి తుళ్లూరు, ఇరుగుపొరుగు మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన సుమారు పాతిక మంది గుర్తింపు కలిగిన నాయకులు, రైతులను ఆహ్వానించారు. రాజధానికి ఇచ్చే భూమి పైన చర్చించారు.
చాలామంది నుండి సానుకూలత వ్యక్తం అయింది. కొందరి నుండి తుళ్ళూరులో జరిగిన సమావేశంలో అధికారులకు షాక్ ఎదురైంది. ప్రభుత్వానికి భూములు అప్పగించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అందుకు తమ డిమాండ్లను సర్కారు అంగీకరించాల్సి ఉంటుందని అక్కడి రైతులు అంటున్నారు.
కొన్ని చోట్ల రైతులు షాక్
రాజధాని పైన భూసేకరణ అంశం ఏపీ సర్కారుకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొత్త రాజధాని కోసం భూములిచ్చేందుకు ప్రజలే ముందుకు వస్తారని భావించిన సర్కారుకు షాక్ తగిలింది. సాగు భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు రైతులు ససేమిరా అంటున్నారు.
మంగళవారం రాత్రి ఉండవల్లి, పెనుమాక రైతులతో ఉండవల్లి గ్రామంలో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. చిన్న, సన్నకారు రైతుల భూములను లాగేసుకునేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు.