'స్విస్ ఛాలెంజ్తో ఏపీకి లబ్ధి', 'జగన్లా సీఎంల కొడుకులు ఉండరు'
స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా అంతిమంగా లబ్ధి పొందేది ఏపీనే అని, ఈ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుసుకోవాలని మంత్రి నారాయణ బుధవారం అన్నారు.
అమరావతి: స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా అంతిమంగా లబ్ధి పొందేది ఏపీనే అని, ఈ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుసుకోవాలని మంత్రి నారాయణ బుధవారం అన్నారు.
ఆయన విలేకరులతో మాట్లాడారు. స్విస్ ఛాలెంజ్ విధానంపై వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
స్విస్ ఛాలెంజ్ విధానాన్ని మహారాష్ట్రలో కొట్టి వేస్తే సుప్రీం కోర్టు సమర్థించిందని వైసిపి నేతలు గుర్తించాలని నారాయణ అన్నారు. అమరావతిలోని భూమిని సింగపూర్ సంస్థకు ఒకేసారి కేటాయించలేదని చెప్పారు. దశలవారిగా అభివృద్ధికి అప్పగించినట్లు తెలిపారు.
వేరే స్థలం తలదూర్చదు
భూమి ఎప్పటికీ సీఆర్డీఏ ఆదీనంలోనే ఉంటుందని నారాయణ చెప్పారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శకతతో ముందుకు వెళ్తున్నామన్నారు. అభివృద్ధిలో వేరే సంస్థ దలదూర్చదని చెప్పారు.
లేపాక్షికి ఎలా కేటాయించారో తెలుసు
స్విస్ ఛాలెంజ్ విధానంలో అంతింమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే లబ్ధి చేకూరుతుందని నారాయణ తెలిపారు. వాన్ పిక్, లేపాక్షికి కాంగ్రెస్ హయాంలో ఎంత తక్కువకు కేటాయించారో ప్రజలకు తెలుసునని చెప్పారు.
అందరు సీఎంల కొడుకులు జగన్లా ఉండరు
అంతకుముందు, నారా లోకేష్ కూడా జగన్పై మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేసిన జగన్ అందరు ముఖ్యమంత్రుల కొడుకులూ అలాగే చేస్తారని అనుకోవడం పొరపాటన్నారు.
జగన్ చరిత్ర ప్రజలు మరిచిపోరు
పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లుగా జగన్కు అందరూ అవినీతిపరులుగానే కనిపిస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. 11 ఛార్జిషీట్లలో ఏ1 ముద్దాయిగా ఉండి.. 16 నెలలు జైలు జీవితం గడిపి వచ్చిన జగన్ చరిత్రను ప్రజలెవరూ మర్చిపోరన్నారు.