బాణసంచా కేంద్రంలో పేలుడు: 11 మంది సజీవ దహనం
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదకొండు మంది మృతి చెందారు. దాదాపు ఏడుగురికి గాయాలయ్యాయి. జిల్లాలోని యూ కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం ఈ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. రెండు అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయి.
బాణసంచా అనధికారికంగా తయారు చేస్తుండగా ఈ విస్పోటనం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు. సంఘటన ప్రాంతం వద్ద, ఆసుపత్రి వద్ద మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పేలుడు ఘటన పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.
రివాల్వర్ మిస్ ఫైర్
ఆదిలాబాద్ జిల్లా రాయికల్ ఎస్సై రివాల్వర్ మిస్ ఫైర్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి నిర్మల్లో ఉన్న మయూరి హోటల్లో ఓ విందు కార్యక్రమం జరిగింది. ఈ విందులో ఎస్సై రివాల్వర్ కిందపడి మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో హోటల్ సర్వర్ కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన సర్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రాజమండ్రిలో వృద్ధ దంపతుల హత్య
రాజమండ్రిలోని కోరుకొండ మండలం గాడాలలో దారుణం జరిగింది. అపార్ట్మెంట్లో కాపలా ఉన్న వృద్ధ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దంపతుల తలపై దుండగులు రాడ్తో మోదీ హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతులు చిట్టెయ్య, మంగమ్మలుగా తెలుస్తోంది.
విజయవాడలోని కేశినేని కార్యాలయం సమీపంలో ఉద్రిక్తత
విజయవాడలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయం సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేశినేని ఆఫీస్ దగ్గర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ సుబ్బారావు భనవ నిర్మాణం జరుగుతుండగా సోమవారం ఉదయం వైసీపీ నాయకులు అక్కడకు చేరుకుని భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
అయితే వైసీపీ పార్టీ ఆఫీస్ కోసమే భవనాన్ని నిర్మిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే షాపింగ్ కాంప్లెక్స్ భవనం నిర్మిస్తున్నామని స్థల యజమానులు చెబుతున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నారు.