బాణాసంచా పేలుడు: వ్యక్తి మృతి, ఫరీదాబాద్లో కూడా..
కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. బైపాస్ రోడ్డులోని ఓ ఇంట్లో బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించి ఓ యువకుడు చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీపావళి సమీపించడంతో బాణాసంచా త్వరగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ మందుగుండు సామాగ్రి నిల్వచేయడంతో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఆ ఇల్లు దగ్ధమైంది. బాణాసంచా తయారుచేస్తున్న జోగి కిరణ్(22) చనిపోగా, అదే కుటుంబానికి చెందిన తులసి, నర్సింగ్ తోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని, మంటలు ఆర్పాయి. కాగా, ఆ బాణాసంచా తయారీ కేంద్రానికి అనుమతి లేనట్లుగా సమాచారం.
మంగళవారం జరిగిన మరో ఘటనలో జిల్లాలోని గానుగపాడులో పిడుగు పడింది. తిరువూరు మండలం గానుగపాడులో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. ఇది ఇలా ఉండగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన బాణాసంచా పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. సోమవారం 12మంది మృతి చెందగా చికిత్స పొందుతూ మంగళవారం ఆరుగురు మృతి చెందారు.
ఆటోను ఢీకొన్న అంబులెన్స్: విద్యార్థి మృతి
అనంతపురం: జిల్లాలోని గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలో మంగళవారం ఆటోను అంబులెన్స్ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు చేవూబిచర్లకు చెందిన రంగరాజు(16)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతిలో 14మంది స్మగ్లర్ల అరెస్ట్
చిత్తూరు: తిరుపతిలో తనిఖీ చేపట్టిన పోలీసులు ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న 14మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 40లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
ఫరీదాబాద్లో బాణసంచా మార్కెట్లో అగ్ని ప్రమాదం
ఫరీదాబాద్లో బాణసంచా మార్కెట్లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు రెండువందల షాపులు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. 18 పైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.