గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం, పేలిన సిలిండర్లు: జనం పరుగు
గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లా నగరం మండల కేంద్రంలోని జంగాలకాలనీలో ఆదివారం నాడు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా దాదాపు వంద ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.కోటి ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
మంటల తీవ్రత కారణంగా 40 వరకు గ్యాస్ సిలిండర్లు పేలాయి. అరగంట వ్యవధిలో జంగాలకాలనీ భస్మీపటలం అయింది. ఈ ప్రమాదంతో స్థానికులు తలోదిక్కుకు పారిపోయారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశాయి.
వేర్వేరు ప్రమాదమాల్లో పలువురు మృతి
ఏపీలో ఆదివారం ఉదయం వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు.విశాఖ జిల్లా దేవరపల్లి మండలం కాశీపురం-తామరబ్బ రహదారిపై సీతంపేట వద్ద తెల్లవారుజామున ట్రాక్టరు అదుపుతప్పి రైవాడ కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తాతాలు మృతి చెందాడు.
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని రజాపురం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంతకల్లు నుంచి గుత్తి వస్తున్న ఆటో రజాపురం మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు(22), గుర్తు తెలియని మహిళ(30) అక్కడికక్కడే మృతి చెందారు.
నకిలీ పాస్ పుస్తకాల తయారీ ముఠా గుట్టురట్టు
నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పట్టణంలో ముఠా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ పట్టదారు పాస్ పుస్తకాలు తయారు చేస్తోందని తెలుసుకున్న పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్టు చేశారు.