ఏపీ సచివాలయంలో అలారం కలకలం: పరుగులు తీసిన ఉద్యోగులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఫైర్ అలారం కలకలం సృష్టించింది. ఒక్కసారిగా ఫైర్ అలారం మోగడంలో... అక్కడున్న ఉద్యోగులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతోందో అర్థంకాక.. అందరూ బయటకు పరుగులు తీశారు.
సెక్రటేరియట్లోని మూడో బ్లాకులో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక కారణాలతోనే క్యాంటీన్లోని ఫైర్ అలారం మోగినట్టు గుర్తించారు. ఆ తర్వాత ప్రమాదమేమీ లేదని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నీరు-ప్రగతిపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
నీరు-ప్రగతి ఉద్యమాన్ని సవాల్గా తీసుకుని విజయవంతం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నీరు-ప్రగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భూగర్భజల మట్టం 3 మీటర్ల దిగువకు తీసుకొచ్చే బాధ్యత కలెక్టర్లదేనని ఆయన అన్నారు.
నీరు-ప్రగతి ఉద్యమంలో విద్యార్ధులు భాగస్వాములు కావాలన్నారు. చెరువుల్లో పూడిక తీసి నీటినిల్వ సామర్ధ్యం పెంచాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల బోర్వెల్స్ రీఛార్జ్ కావాలని అన్నారు. అన్ని చెరువుల కింద ఆయకట్టుకు గ్రావిటి కింద సాగునీరు ఇవ్వగలగాలన్నారు. పండ్లతోటల్లో పంటకుంటల తవ్వకాన్ని ఉద్యానశాఖ ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.