ఏపీ రాజధానికి తొలి సాఫ్ట్వేర్ కంపెనీ, రూ.600 కోట్ల పెట్టుబడి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పైన సింగపూర్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఏపీ రాజధానిని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు సింగపూర్ ప్రతినిధులు రాజధాని ప్రాంతంలో పర్యటించారు.
కాగా, అమరావతికి తొలి సాఫ్టువేర్ కంపెనీ అప్పుడే వచ్చేస్తోంది. మంగళగిరి సమీపంలోని ఏపీఐఐసీ భూములలో పైడాటా సెంటర్కు పది ఎకరాల భూమిని కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిని 33 ఏళ్ల పాటు సాఫ్టువేర్ కంపెనీకి లీజుకు ఇచ్చారు.
ప్రతి ఏటా కోటి రూపాయలను ఏపీఐఐసీకి చెల్లించేలా లీజు నిబంధనలలో పేర్కొన్నారు. దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును స్థాపించబోతున్నారు. దీని వలన సుమారు ముడు వందల మందికి ఉపాధి లభించనుంది. పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి లభిస్తుంది.
భవిష్యత్తు రాజధాని కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా, డైనమిక్గా ఉంటుందని, ఆర్థిక, సామాజిక, ఉపాధి అవకాశాలతో సమగ్ర నిర్ణాయక కేంద్రంగా ఉంటుందని, 21వ శతాబ్దిలోనే మేటి ప్రజా రాజధానిగా అమరావతి భాసిల్లుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.
ప్రతి తెలుగువాడూ గర్వంగా తలెత్తుకునేలా ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. తన విశ్వసనీయత వల్లనే సింగపూర్ ఉచితంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందన్నారు.