ట్విస్ట్: ఉద్యోగం కోసం తండ్రి హత్య, డబ్బులు ఇవ్వక బయటపెట్టిన హంతకులు
ఉద్యోగం కోసం కన్నతండ్రినే కిరాయి హంతకులతో హత్యచేయించి ఉద్యోగం పొందాడు ఓ నిందితుడు.అయితే కిరాయి హంతకులకు ఇస్తానన్న మొత్తం ఇవ్వకపోవడంతో వారు రెవిన్యూ అధికారులకు లొంగిపోవడంతో అసలు విషయం వెలుగుచూసింది.
బాపట్ల: ఉద్యోగం కోసం కన్నతండ్రినే కిరాయి హంతకులతో హత్యచేయించి ఉద్యోగం పొందాడు ఓ నిందితుడు.అయితే కిరాయి హంతకులకు ఇస్తానన్న మొత్తం ఇవ్వకపోవడంతో వారు రెవిన్యూ అధికారులకు లొంగిపోవడంతో అసలు విషయం వెలుగుచూసింది.ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో చోటుచేసుకొంది.
నాగరికత పెరగినకొద్దీ మానవత్వం మచ్చుకైనా కన్పించకుండాపోతోంది. ఉద్యోగం కోసం కన్నతండ్రినే హత్య చేయించడం ఆలస్యంగా వెలుగుచూసింది. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన మల్లెల రవికుమార్ ను కొడుకు, అల్లుళ్ళు కలిసి హత్య చేయించారు.
బాపట్లలోని కొత్తపేటకు చెందిన మల్లెల రవికుమార్ నెల్లూరులోని తెలుగు గంగ ప్రాజెక్టు కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తుండేవాడు. అతనికి నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు. రవికుమార్ నెల్లూరులోని కిసాన్ నగర్ లో ఉంటూ విధులకు వెళ్ళేవాడు. నిత్యం మద్యం తాడి వచ్చి భార్యను వేధించేవాడు. ఇంట్లో కుమారుడు అల్లుళ్ళతో గొడవపడేవాడు.
రవికుమార్ ను చంపిస్తే ప్రతిరోజూ ఈ గొడవలు తప్పిపోతాయని భావించారు.అంతేకాదు ఆ ఉద్యోగం కూడ రవికుమార్ కొడుకు ఆనందరావుకు వస్తోందని భావించారు. అయితే తమ చేతికి మట్టి అంటకుండా ఉండేందుకుగాను వారు పథకం వేశారు. నెల్లూరులో ఉంటున్న రవికుమార్ రెండో అల్లుడు ప్రశాంత్ ఈ హత్యకు పథకాన్ని రచించాడు.
కిరాయి హంతకులు శివాజీ, యోహనుతో మాట్లాడి రవికుమార్ ను హత్యచేస్తే రూ. 60 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొన్నారు. 2016 జూలై 30న, ఇంట్లో ఉన్న రవికుమార్ కాళ్ళు చేతులు కట్టేసి ముఖంపై దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. అయితే గుండెపోటుతో రవికుమార్ చనిపోయాడని అందరిని నమ్మించాడు.
మృతదేహనన్ని బాపట్లకు తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించారు. రవికుమార్ మరణించడంతో కారుణ్య నియామకం కింద ఆనందరావుకు గూడూరు తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. అయితే కిరాయి హంతకులకు ఇస్తామన్న రూ.60 వేల రూపాయాలలో కేవలం రూ,. 10 వేలు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.50 వేలు చెల్లించలేదు. ఆగ్రహనికి లోనైన కిరాయి హంతకులు నెల్లూరు వీఆర్ఓ సుబ్బరాజు వద్ద లొంగిపోయారు. తాము చేసిన హత్య గురించి వివరించారు.
పోలీసుల సమక్షంలోనే రవికుమార్ సమాధిని తవ్వి మృతదేహన్ని బయటకు తీశారు. గుంటూరు వైద్య కళాశాల పోరెన్సిక్ నిపుణులు కృష్ణమూర్తి పరీక్ష నిమిత్తం ప్రయోగశాలకు మృతదేహం భాగాలను తరలించారు.ఈ కేసులో మృతుడి భార్య శాంతమ్మ, రెండో అల్లుడు ప్రశాంత్, మూడో అల్లుడు ప్రదీప్, కొడుకు ఆనందరావు , కిరాయి హంతకులు శివాజీ ,యోహనులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.