ఐదుగురు మంత్రులకు ఉద్వాసన: వారెవరు, చంద్రబాబు ప్లానేమిటి?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణను వాయిదా వేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాతనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటున్నారు. ఆ ఎన్నికల్లో పనితీరును బట్టి కూడా మంత్రుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే, ఇప్పటికిప్పుడైతే ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలకాలని ఆయన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
ఉద్వాసనకు గురయ్యే ఐదుగురు మంత్రులు ఎవరనే విషయంపై ముమ్మరంగా చర్చ సాగుతోంది. అయితే, కచ్చితంగా ఎవరూ పేర్లు చెప్పలేకపోతున్నారు. ఇటీవలి తరుచుగా వివాదాల్లో చిక్కుకుంటున్న ఓ మంత్రితో పాటు గతంలో ఆరోపణలు ఎదుర్కున్న ఓ మహిళా మంత్రికి ఉద్వాసన తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిగతా ముగ్గురు ఎవరనేది తేలాల్సి ఉంది. సామాజిక ఫార్ములాలను పాటించడానికి చంద్రబాబు ఇప్పటికే కూడికలు, తీసివేతల పనిని సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
తొలుత విజయదశమికి మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుందని భావించారు. మునిసిపల్ ఎన్నికలు వస్తున్న కారణంగా అది వాయిదా పడినట్లు చెబుతున్నారు. రాష్ర్టంలో ఆరు కార్పొరేషన్లు, అయిదు పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. సాధారణ ఎన్నికల కన్నా ముందే మునిసిపల్, పంచాయితీ, మండల ఎన్నికలు జరిగాయి.
సాధారణ ఎన్నికల తర్వాత ఏ విధమైన ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదు. మున్సిపల్ ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి ప్రమోషన్ ఇస్తామనీ, క్షేత్రస్థాయిలో వెనకపడినవారికి ఉద్వాసన ఉంటుందని ఇటీవల జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు మంత్రులకు అగ్నిపరీక్షగా మారాయి.
మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ఇరవైమంది మంత్రులున్నారు. మరో అయిదుగురిని మంత్రివర్గంలో చేర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రుల్లో అయిదుగురిని తొలగిస్తే మొత్తం పదిమంది కొత్తవారికి అవకాశం దక్కుతుంది.
మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులను సర్దుబాటు చేయడానికి దాని వల్ల వీలు కలుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి 20 మంది శాసనసభ్యులు వచ్చారు. వారిలో కనీసం ఐదుగురికి మంత్రులు పదవులు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
మున్సిపల్ ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో జరుగుతాయని అనుకున్నారు. కానీ పార్టీ సీనియర్ నేతల సూచన మేరకు ఆ ఎన్నికలను సంక్రాంతి తర్వాత జరపాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మంత్రివర్గ విస్తరణ ఫిబ్రవరికి వాయిదా పడవచ్చునని అంటున్నారు.