మీకు ఒకటిస్తా, నాకు 2 'ప్లస్' ఇవ్వండి!: రాజ్యసభపై మోడీకి బాబు
విజయవాడ: ఏపీలో తన మిత్రపక్షమైన బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నేత, ప్రస్తుత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు రాజ్యసభ అవకాశం ఇవ్వనున్నారు.
ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఇందులో మూడు టిడిపి, ఒకటి వైసిపి గెలుచుకోనున్నాయి. ఏపీలో బీజేపీ మిత్రపక్షం కాబట్టి టిడిపికి రెండు, బీజేపీకి 1 సీటు దక్కనుంది. బీజేపీకి దక్కే ఆ సీటు నిర్మలా సీతారామన్కు ఇవ్వనున్నారు.
బీజేపీకి ఒక రాజ్యసభ సీటుకు ఇవ్వనున్నందుకు గాను చంద్రబాబు బీజేపీ వద్ద పలు డిమాండ్లు పెడుతున్నారని తెలుస్తోంది. అందులో ప్రధానంగా రెండు గవర్నర్ పోస్టులు అడగనున్నారని తెలుస్తోంది. వాటితో పాటు పలు నామినేటెడ్ పోస్టులు కోరనున్నారు.
సమాచారం మేరకు.. ఇప్పటికే టిడిపి - బీజేపీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒక రాజ్యసభకు బదులు రెండు గవర్నర్ పోస్టులు, ఇతర నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని టిడిపి కోరినట్లుగా సమాచారం. నిర్మలకు ఇచ్చేందుకు తాము సిద్ధమని, కానీ తమకు ప్రధానంగా 2 గవర్నర్ పోస్టులు కావాలని టిడిపి విజ్ఞప్తి చేసింది.
తాము రెండు గవర్నర్ పోస్టులు అడిగామని, అయితే, ఒక గవర్నర్ పోస్టు ఇచ్చినా తమకు సంతోషమేనని టిడిపి నేతలు గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది.
మోత్కుపల్లికి బాబు హామీ
తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ పదవి ఇస్తామని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. ఇందుకోసం బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇటీవల మోత్కుపల్లి నర్సింహులు పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. తనకు హామీ ఇచ్చిన మేరకు గవర్నర్ పోస్ట్ కుదరకుంటే తనను రాజ్యసభకు పంపించాలని కోరారు.
అయితే, ఓ సీటు సుజనా చౌదరికి, మరో సీటు బీజేపీకి, ఇంకో సీటు బీసీలకు ఇవ్వాల్సిన నేపథ్యంలో చంద్రబాబు తిరస్కరించారు.
శనివారం మహానాడు వేదికగా మోత్కుపల్లి మాట్లాడుతూ... నేను మీ భక్తుడిని అని, రాముడికి హనుమంతుడు ఎలాగో, టిడిపికి నేను అంతేనని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరే నాకు అన్న, మీరే ఏకైక దిక్కు అన్నారు. పార్టీకే నా జీవితం అంకితం అన్నారు.
ఎన్టీఆర్ శిష్యుడిని అని చెప్పారు. నేను తెలంగాణ వాడిని అనుకుంటే తెలంగాణ, ఆంధ్రా వాడిని అనుకుంటే ఆంధ్రానే అన్నారు. మీరు (చంద్రబాబు) పిలిస్తే మీ వెంటే ఉంటానని, నేను ఎవరి వద్దనో అనుచరుడిగా ఉండలేనని, మీకు దండం పెడతానని, కేంద్ర కమిటీలో తనను ఉంచాలని మోత్కుపల్లి అన్నారు.