అనంతలో పడగవిప్పిన ఫ్యాక్షన్: వేటకొడవళ్లతో మంత్రి కాల్వ అనుచరుడి హత్య
అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ హత్య చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బాదన్నను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు.
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ హత్య చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బాదన్నను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు.
గోళ్ల గ్రామానికి చెందిన బాదన్న గురువారం ఉదయం వాకింగ్కు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, వేటకొడవళ్లతో దాడి చేశారు. తల, భుజాలపై విచక్షణారహితంగా నరికి అక్కడి నుంచి పరారయ్యారు.
తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న బాదన్నను గ్రామస్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
బాదన్న మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.గతంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా పని చేసిన బాదన్న ప్రస్తుతం వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. మంత్రి కాల్వ శ్రీనివాసులకు ఆయన ముఖ్య అనుచరుడు.
గ్రామంలో రోడ్డు విషయంలో బంధువులతో బాదన్నకు గొడవలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. హత్యకు ఇదే కారణమా? లేదా వేరే కారణమేదైనా ఉందా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.