కొణతాల రామకృష్ణకు టిడిపి బంపర్ ఆఫర్: పార్టీలో చేరితే అవకాశమిస్తాం
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు టిడిపి బంపర్ ఆఫర్ ఇచ్చింది. విశాఖ వేదికగా జరిగే మహానాడులో ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పించనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.
నర్సీపట్నం: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు టిడిపి బంపర్ ఆఫర్ ఇచ్చింది. విశాఖ వేదికగా జరిగే మహానాడులో ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పించనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. పార్టీలో చేరితే ఈ అవకాశం కల్పించనున్నట్టు సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు కూడ కొణతాలను పార్టీలో చేర్చుకొనే విషయమై సానుకూలంగా ఉన్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
విశాఖ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీమంత్రి, వైసీపీ నాయకుడు కొణతాల రామకృష్ణ టిడిపి వైపు చూస్తున్నారు.ఈ మేరకు ఆయన అధికారపార్టీలో చేరే విషయంలో ఆ పార్టీ నాయకులు కూడ సానుకూలంగానే ఉన్నారు.
అయితే ఈ దఫా మహానాడు విశాఖలోని ఆంధ్రాయూనివర్శిటీ ప్రాంగణంలో నిర్వహించాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. అయితే కొణతాలను మహానాడు వేదికపై మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు కొణతాల పట్ల టిడిపి కొంత మెతకవైఖరిని అవలంభిస్తోందనే అభిప్రాయంతో ఉంది.
కారణాలు ఏమైతేనేం కొణతాల టిడిపిలో చేరడానికి ఆలస్యమైంది. టిడిపి చీఫ్ కూడ ఈ విషయమై సానుకూలంగా ఉన్నారు.అయితే పార్టీలో చేరే విషయమై కొణతాల ఇంకా ఆలోచిస్తున్నారు. కారణాలు మాత్రం అంతుబట్టడం లేదని టిడిపి నాయకులు చెబుతున్నారు.
మహానాడు వేదికపై మాట్లాడే అవకాశం ఇస్తాం
టిడిపిలో చేరితే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై మహానాడులో మాట్లాడే అవకాశాన్ని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కు కల్పిస్తామని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్దిపై విశాఖలో మేధావుల ఫోరం పేరుతో నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన వారంతా సమస్యలపై అవగాహనలేనివారేనని చెప్పారు. అయితే ఉత్తరాంధ్ర సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న నాయకుడిగా కొణతాలకు గుర్తింపు ఉందన్నారు అయ్యన్నపాత్రుడు. మరో వైపు మహనాడులోపుగా పార్టీలో చేరితే ఉత్తరాంధ్ర సమస్యలపై మహానాడు వేదికలో మాట్లాడేందుకు అవకాశం కల్పించనున్నట్టు అయ్యన్న కొణతాల ఆఫర్ ఇచ్చారు.
దాడి X కొణతాల
విశాఖ జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గంలో మాజీమంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణకు అసలు పడదు. కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉంటే, దాడి వీరభద్రరావు టిడిపి లో ఉన్నాడు. అయితే 2014 ఎన్నికలకు ముందుగా దాడి వీరభద్రరావు టిడిపిని వీడి వైసీపీలో చేరారు. కొణతాల రామకృష్ణ కూడ వైసీపీలో ఉండేవారు. అయితే ఆయన కూడ వైసీపీకి దూరమయ్యారు. ఇద్దరూ బద్దశత్రువులు ఒకే పార్టీలో ఉంటూ ఆ పార్టీని వీడారు. అయితే వీరిద్దరూ కూడ టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాడి వీరభద్రరావు టిడిపిలో చేరేందుకు సంకేతాలను పంపినా పార్టీ నుండి సానుకూలంగా స్పందనలేదు. మరో వైపు కొణతాల రామకృష్ణను టిడిపిలో చేర్చుకొనేందుకు టిడిపి నాయకత్వం ప్రయత్నాలు చేస్తొంది. కారణాలు ఏమో కానీ, కొణతాల మాత్రం టిడిపిలో చేరేందుకు ఇంకా సమయం తీసుకొంటున్నారు.
రాజకీయ భవిష్యత్తు కోసం సదస్సులు
ఉత్తరాంధ్ర సమస్యలపై మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సదస్సులను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మంత్రిగా ఉన్న కొణతాల రామకృష్ణ ఎందుకు ఈ విషయాలను పట్టించుకోలేదని టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాలకు గోదావరి జలాలను అందించేందుకు తాళ్ళపాలెం వద్ద మరో ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు కృషిచేస్తున్నట్టు అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. రాజకీయ భవిష్యత్ పునర్నిర్మాణం కోసమే కొణతాల రామకృష్ణ సదస్సులను నిర్వహిస్తున్నారని అయ్యన్న విమర్శించారు.
ఉత్తరాంధ్ర అభివృద్దికి కట్టుబడి ఉన్నాం
ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని అయ్యన్నపాత్రుడు చెప్పారు. 1980 నుండి రాష్ట్ర ప్రజలు కలలు కంటున్న పోలవరం ప్రాజెక్టకు కార్యరూపం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతోందన్నారాయన. 2018 డిసెంబర్ నాటికి విశాఖ ప్రజల తాగునీటి అవసరాలతో పాటు పరిశ్రమలకు నీరిచ్చేందుకు పురుషోత్తపట్నం ప్రాజెక్టును యుద్దప్రాతిపదికన చేపడుతామన్నారు.పదేళ్ళపాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఉన్న కొణతాల రామకృష్ణ రైవాడ నీటిని రైతులకు అందిస్తామన్న మాటను నిలుపుకోలేదన్నారు.