ముహుర్తం ఖరారు: సచివాలయానికి ఈనెల 17న శంకుస్థాపన?
అమరావతి: గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించదలచిన తాత్కాలిక సచివాలయ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ విషయాన్ని ఆది లేదా సోమవారాల్లో వెల్లడించనుందని తెలుస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 12న తెల్లవారు జామున జరగాల్సి ఉంది. అయితే, టెండర్ల ఖరారులో నెలకొన్న ప్రతిష్ఠంభన కారణంగా ఇది వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి టెండర్లు దాఖలు చేసిన ఎల్ అండ్ టీ, షాపోర్ జీ పల్లోంజీ కంపెనీలతో అవి కోట్ చేసిన ధరలను తగ్గించుకుని, వెంటనే నిర్మాణ పనులను చేపట్టాలని కోరుతూ మంత్రి నారాయణ నేతృత్వంలో జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఈ నెల 17న శంకుస్థాపన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి కేవలం రెండు కంపెనీలు మాత్రమే టెండర్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు కంపెనీల్లో ఏదో ఒకదానికి టెండర్ను ప్రభుత్వం ఖరారు చేయనుంది.
టెండర్ ఖరారు చేసిన విషయాన్ని, ఆయా కంపెనీలు ఏ ధరలకు సమ్మతించాయన్న అంశాన్ని ఆదివారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 14న సీఆర్డీఏ బోర్డు సమావేశం, 15న క్యాపిటల్ సిటీ ఫైనల్ మాస్టర్ ప్లాన్ రాక, ఆ తర్వాత 17న తాత్కాలిక సచివాలయ సముదాయానికి శంకుస్థాపన జరగనుందని తెలిసింది.