ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య!: ఏలూరులో పెను విషాదం..
ఏలూరులోని బీడీ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకోగా.. మృతులను ఒకే కుటుంబానికి చెందిన పద్మావతి(60), సంతోషి రూప(35), సాయి సిద్దార్థ(9), సాయిరామ్(5)లుగా గుర్తించారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఒక కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. గత కొన్నాళ్లుగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఏలూరులోని బీడీ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకోగా.. మృతులను ఒకే కుటుంబానికి చెందిన పద్మావతి(60), సంతోషి రూప(35), సాయి సిద్దార్థ(9), సాయిరామ్(5)లుగా గుర్తించారు. నలుగురూ ఒకే ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో ఇంట్లో నుంచి దుర్వాసన రావడం మొదలైంది. నాలుగు రోజుల క్రితం వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
విషయం తెలియగానే.. సంఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ఇటీవలే కుటుంబ సభ్యులను కోల్పోవడంతో వీరంతా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే వీరి మరణం వెనుక అసలు కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.