ఘోరం: బాలికను కిడ్నాప్ చేసి నలుగురు యువకులు గ్యాంగ్రేప్, వీడియో తీసి..
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలో ఓ బాలికను నలుగురు యువకులు కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత, వీడియోలు తీసి బెదిరింపులకు తెగబడ్డారు.
గుంటూరు: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలో ఓ బాలికను నలుగురు యువకులు కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత, వీడియోలు తీసి బెదిరింపులకు తెగబడ్డారు. ఈ ఘటన ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
48 గంటలపాటు సాగిన ఈ దుర్మార్గంపై బాధిత బాలిక.. తల్లిదండ్రులకు చెప్పి విలపించింది. వారు బాలికను హుటాహుటిన గుంటూరులోని వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
ఈ ఉదంతంపై బాలిక తల్లిదండ్రులు, బంధువులు, వివిధ సంఘాల నాయకులు సత్తెనపల్లికి భారీగా తరలివచ్చి ఆదివారం స్థానిక తాలూకా సెంటర్లో మాచర్ల-గుంటూరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం బాలిక తండ్రి పోలీసుల తీరుపై మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు.
బాధిత బాలిక గుంటూరులోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె తల్లిదండ్రులు కుమార్తె చదువును మధ్యలోనే ఆపివేసి మూడు నెలల క్రితం స్వగ్రామమైన ఉయ్యందుకు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఫిబ్రవరి 15న దేవళ్ళ శివయ్య పొలంలో మిరపకాయలు కోసేందుకు వెళ్లిన బాలిక కాలకృత్యాల కోసం పొదలమాటుకు వెళ్లగా అప్పటికే మాటువేసి వున్న ఏపూరి రామకృష్ణ, ఆది నరేంద్ర, పొత్తూరి వెంకటేశ్వర్లు, మలిశెట్టి రాములు బలవంతంగా ఆమెను జిడుగు గ్రామ శివార్లలోని ఓ రేకుల షెడ్డులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతూ వీడియో తీశారు.
మర్నాడు రాత్రి 7 గంటల తర్వాత ఇద్దరు వ్యక్తుల ద్వారా బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. అదే రోజు సాయంత్రం క్రోసూరు పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఫిర్యాదు చేశారు. అయితే తామిచ్చిన ఫిర్యాదుపై అచ్చంపేట ఎస్ఐ రాజేశ్వరరావు, సత్తెనపల్లి రూరల్ సిఐ కోటేశ్వరరావు వేరే కేసు నమోదు చేశారని బాలిక బంధువులు ఆరోపించారు.
క్రోసూరు ఎస్ఐ సెలవులో ఉండటంతో ఈ కేసును అచ్చంపేట ఎస్ఐ నమోదు చేసినట్లు తెలిపారు. క్రోసూరు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదని, పాలకపక్ష నేతలు, అగ్రకులాలు ఒక్కటై నిందితులను రక్షించే దిశగా పావులు కదుపుతున్నారని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న పట్టణ సిఐ ఎస్ సాంబశివరావు, ఎస్సై నక్కా ప్రకాశరావు హుటాహుటిన తమ సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి డిఎస్పీ కార్యాలయంలో మాట్లాడుకుందామని నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.
కాగా, తమకు న్యాయం చేయాలంటూ బాలిక చికిత్స పొందుతున్న గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఎదుట తల్లిదండ్రులు, బంధువులు మరోసారి ఆందోళనకు దిగారు. ఆందోళన సందర్భంగా బాలిక తల్లి సొమ్మసిల్లిపోయింది. ఇప్పటికే ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసి, ఫిర్యాదు ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మధుసూదనరావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరించారు.